china rocket: హమ్మయ్య.. ముప్పు తప్పింది!

గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కులాయి. దీంతో భూమిపై పడనున్నాయన్న భయాందోళనలకు తెరపడింది....

Updated : 09 May 2021 11:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. దీంతో భూమిపై పడనున్నాయన్న భయాందోళనలకు తెరపడింది. భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకు శకలాలు పూర్తిగా భస్మమయ్యాయి. కేవలం కొన్ని చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడ్డాయి. ఈరోజు ఉదయం భూవాతావరణంలోకి ప్రవేశించిన శకలాల దశను చైనా మ్యాన్‌డ్‌ స్పేస్‌ ఇంజినీరింగ్‌ ఆఫీస్‌ ఎప్పటికప్పుడు పరిశీలించింది. హిందూ మహా సముద్రంపై రాకెట్‌ భాగాలు విచ్ఛిన్నమయ్యాయని ముందే పేర్కొంది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో శకలాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. చైనా పేర్కొన్న ఈ ప్రాంతం మాల్దీవులకు కొద్ది దూరంలోనే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో మాల్దీవులకు త్రుటిలో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అలాగే శకలాలు కుప్పకూలుతున్న దృశ్యాలను మాల్దీవుల నుంచి కొందరు ఫోన్‌లో బందించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించినవిగా పేర్కొంటూ కొంతమంది కొన్ని వీడియోలు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా చైనా గతవారం ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ అనే భారీ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్‌ మాడ్యూల్‌ను అది విజయవంతంగా మోసుకెళ్లింది. అయితే ఆ రాకెట్‌ నియంత్రణ కోల్పోయిందని, దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని అంతరిక్ష రంగ నిపుణులు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. దాని ప్రయాణ మార్గాన్ని తమ అంతరిక్ష సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. 

‘లాంగ్‌మార్చ్‌ 5బి’ పరిమాణం (22 టన్నులు) మరీ ఎక్కువగా ఉండటంతో.. దాని పెద్దపెద్ద విడిభాగాలు భూమిపై అలాగే పడిపోయే ముప్పుందని తొలుత కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శకలాలు భూమిని తాకినప్పుడు.. చిన్నపాటి విమానం కూలిపోయినట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఆ భయాందోళనలేవీ నిజం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, జనావాసాలపై కూలే ముప్పు అత్యల్పమని కొంత మంది ఖగోళ నిపుణులు చెప్పిందే చివరకు నిజమైంది. గత ఏడాది చైనా తొలిసారి ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ని ప్రయోగించినప్పుడు దాని శకలాలు ఐవరీ కోస్ట్‌పై పడి పలు గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసమైన సంగతి గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని