వుహాన్‌ ల్యాబ్‌ లీక్‌పై దర్యాప్తు దండగ!

వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌పై దర్యాప్తును వీలైనంత మేరకు అడ్డుకొనేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే అంశంపై మరోసారి దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించడంపై చైనా మండిపడింది.

Updated : 22 Jul 2021 19:43 IST

 పూర్తిగా అడ్డం తిరిగిన చైనా..

ఇంటర్నెట్‌డెస్క్‌: వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌పై దర్యాప్తును వీలైనంత మేరకు అడ్డుకొనేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే అంశంపై మరోసారి దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించడంపై చైనా మండిపడింది. ల్యాబ్‌ లీక్‌పై ఎటువంటి ఆధారాలు లేవని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన చైనా నిపుణుల బృందానికి అధ్యక్షత వహిస్తున్న లియాంగ్‌ వాన్నియన్‌ గురువారం బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ వైరస్‌ సహజంగా జంతువుల్లోంచి మరో ఆతిథ్య జంతువులోకి చేరి.. అక్కడి నుంచి మనుషులను సోకిందని వెల్లడించారు. ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతం అసంభవమని పేర్కొన్నారు. వుహాన్‌ ల్యాబ్‌లో అసలు కరోనా వైరస్‌లే లేవని చెప్పారు. అలాంటప్పుడు దానిపై వనరులను ఖర్చుచేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని తేల్చేశారు. 

ఇప్పటికే చాలాసార్లు ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతాన్ని కొట్టిపారేసిన చైనా గురువారం మరో అడుగు ముందుకేసింది. ఇంతకు మించి దర్యాప్తు చేసేది లేదని తేల్చేసింది. ఈ సిద్ధాంతం ఎంత ప్రచారంలో ఉన్నా.. చైనా దర్యాప్తులో భాగస్వామిగా ఉండబోదని పేర్కొంది. ఈ దర్యాప్తుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపును చైనా తొలిసారి నేరుగా తిరస్కరించింది. ‘‘వైరస్‌ పుట్టుకపై రెండో దర్యాప్తులో కేవలం పుకార్లే ఉన్నాయి. అవి సైన్స్‌, ఇంగితజ్ఞానాన్ని ఏమాత్రం గౌరవించవు. కరోనా గుట్టు విప్పటానికి మేం కట్టుబడి ఉన్నాం. సైన్స్‌ ఆధారంగా నిఖార్సైన పరిశోధన జరగాలి. కానీ, ల్యాబ్‌ లీక్‌ దర్యాప్తు అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తర్వాతి స్థాయికి తీసుకెళుతోంది. అది మొత్తం రాజకీయాలతో నిండి, సైన్స్‌ పట్ల అహంకారపూరిత వైఖరితో ఉంది’’ అని చైనా వైస్‌ మినిస్టర్‌ జంగ్‌ ఇక్సిన్‌ పేర్కొన్నారు. 

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని వుహాన్‌లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ‘‘కరోనా వైరస్‌ మూలాలను తెలుసుకునేందుకు చైనా తప్పనిసరిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం’’ అని జెనీవాలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.  ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తునకు ఆదేశించింది. గతంలో ఈ ల్యాబ్‌ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మొక్కుబడిగా నివేదిక ఇచ్చింది. ‘పీ4 ల్యాబ్‌లోని యానిమల్‌ రూమ్‌లో వివిధ జంతువులు ఉండొచ్చు. సార్స్‌కోవ్‌-2 వంటి వాటిపై కూడా పరిశోధన చేయవచ్చు’ అని తెలిపింది. అంతేకానీ, అక్కడ గబ్బిలాలను పెంచుతున్న విషయం పేర్కొనలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని