కన్నీళ్లు పెట్టుకున్న చిరాగ్‌ పాసవాన్‌

దివంగత నేత, దళిత దిగ్గజం రాంవిలాస్‌ పాసవాన్‌ను గుర్తుచేసుకుని ఆయన కుమారుడు, ఎల్జేపీ యువ నేత చిరాగ్ పాసవాన్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం రాంవిలాస్‌ జయంతిని పురస్కరించుకుని

Updated : 05 Jul 2021 12:50 IST

దిల్లీ: దివంగత నేత, దళిత దిగ్గజం రాంవిలాస్‌ పాసవాన్‌ను గుర్తుచేసుకుని ఆయన కుమారుడు, ఎల్జేపీ యువ నేత చిరాగ్ పాసవాన్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం రాంవిలాస్‌ జయంతిని పురస్కరించుకుని కుటుంబసభ్యులు ఆయనపై పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరాగ్‌ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి సింహం లాంటి వ్యక్తి. ఆయన కొడుకుగా నేను ఎన్నడూ భయపడను. ఎంతమంది మమ్మల్ని కిందపడేయాలని చూసినా వెనకడుగు వేసేది లేదు. బిహార్‌ ప్రజలే నా బలం. నేను, నా తల్లి ఒంటరిగా నిలబడి వారికోసం పోరాటం చేస్తాం’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

ఈ సందర్భంగా తన చిన్నాన్న పశుపతి పరాస్‌ గురించి కూడా చిరాగ్‌ స్పందించారు. ‘‘ఈ రోజు నా బాబాయి కూడా నాతో ఉంటాడనుకున్నా. కానీ అది జరగలేదు. మా సొంత కుటుంబంలోనే కొంతమంది మమ్మల్ని మోసం చేశారు. కానీ మిగతా కుటుంబమంతా మాకు మద్దతుగా ఉంది. మనం చేసే పని, నిబద్ధతతోనే ప్రజలు మనల్ని గుర్తిస్తారని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఇబ్బందులు దాటితేనే ముందుకు వెళ్లగలం’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

చిరాగ్‌.. ఆశీర్వాద్‌ యాత్ర

రాంవిలాస్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన నియోజకవర్గమైన హజీపూర్‌ నుంచి చిరాగ్‌ నేడు ‘ఆశీర్వాద్‌ యాత్ర’ ప్రారంభించారు. బిహార్‌లోని ప్రతి జిల్లాలో ఈ యాత్ర చేపట్టనున్నామని, ప్రజల నుంచి ఆశీర్వాదం పొందడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇటీవల పశుపతి పరాస్‌ నేతృత్వంలో ఎల్జేపీలో చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు కూడగట్టుకునేందుకు చిరాగ్‌ ఈ యాత్ర మొదలుపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని