SC: సుప్రీంకోర్టులో 32కు చేరిన జడ్జీల సంఖ్య.. ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది. నూతనంగా నియామకమైన ఐదుగురు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.

Published : 06 Feb 2023 12:45 IST

దిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌తో పాటు జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్ మనోజ్‌ మిశ్ర సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ (D Y Chandrachud) వీరితో ప్రమాణం చేయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుకుంది. ఇక రెండే ఖాళీలు ఉన్నాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం (Collegium) గతేడాది డిసెంబరు 13న ఈ అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనల విషయంలో సుప్రీం, కేంద్రానికి మధ్య ఇటీవల అభిప్రాయభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సిఫార్సులకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గత శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా.. మిలిగిన రెండు ఖాళీలకు కూడా కొలీజియం గత నెల సిఫార్సులు పంపించింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ధర్మాసనంపై రెండో తెలుగు వ్యక్తి..

ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ తర్వాత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చోబోతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్ (Justice P V Sanjay Kumar)‌. సుదీర్ఘకాలం ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా సేవలందించిన ఆయన తండ్రి పి.రామచంద్రారెడ్డిది చిత్తూరు జిల్లా. జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ 1963 ఆగస్టు 14న హైదరాబాద్‌లో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 2008 ఆగస్టు 8న అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్‌ 14న పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని