
Arvind Kejriwal: ‘మా మంత్రిని అరెస్టు చేయబోతున్నారు.. అయినా భయపడబోం’
దిల్లీ: కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేంద్రం మరోసారి దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపేందుకు చూస్తున్నట్లు ఆరోపించారు. త్వరలోనే ఆమ్ ఆద్మీ నేత, దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ను అరెస్ట్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధంగా ఉందని తనకు సమాచారం అందినట్లు వెల్లడించారు. అయితే భాజపా చేపట్టే ఇలాంటి దాడులకు తాము భయపడబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జైన్ ఇంట్లో ఇప్పటికే రెండుసార్లు ఈడీ అధికారులు సోదాలు చేశారని.. మళ్లీ వచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. తాము నిజాయతీగా, న్యాయంగానే పనిచేస్తామని పునరుద్ఘాటించారు.
పంజాబ్లో ఎన్నికల నేపథ్యంలో సత్యేంద్ర జైన్ కొద్దిరోజులుగా అక్కడే ఉన్నారు. పార్టీ ప్రచారాలు, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆయనపై ఈడీ సోదాలు నిర్వహించబోతోందని పేర్కొన్నారు. ‘తమ ప్రాబల్యం తగ్గిపోతోందని లేదా ఎన్నికల సమయంలో తమ పార్టీ ఓడిపోబోతోందని భాజపా భావిస్తుందో అప్పుడు ఈడీ లాంటి కేంద్ర సంస్థలను రంగంలోకి దింపుతుంది. ప్రతిపక్ష నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుంది. కానీ ఇలాంటి చర్యలతో మేం వెనకడుగు వేయబోం. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీలాగా మేం బయపడబోం. ఎందుకంటే ఆయనలా మేం ఎలాంటి తప్పులూ చేయలేదు’ అని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.