National Herald case: ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో మల్లికార్జున ఖర్గేను విచారించిన ఈడీ

‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక అవినీతి కేసుకు సంబంధించి రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే(79)ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు......

Published : 11 Apr 2022 18:53 IST

దిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక అవినీతి కేసు విచారణ మళ్లీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే(79)ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసులో భాగంగా ఆయనకు ఈడీ నోటీసులు పంపింది. సోమవారమే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లిన ఖర్గేను ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్​మెంట్​ను రికార్డు చేశారని, విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు పేర్కొన్నాయి.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌గాంధీ తదితరులు నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారంటూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలోనే ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని