అమెరికన్ల జీవితాలను కాపాడే నిర్ణయం ఇది!

అమెరికాలో కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న పౌరులకు ఉపశమనం కలిగించే దిశగా మరో ముందడుగు పడింది. 1.9 ట్రిలియన్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లుకు గురువారం ఆ దేశ కాంగ్రెస్‌ ఆమోదం పలికింది.

Updated : 11 Mar 2021 11:50 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న పౌరులకు ఉపశమనం కలిగించే దిశగా మరో ముందడుగు పడింది. 1.9 ట్రిలియన్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లుకు గురువారం ఆ దేశ కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది.  కొవిడ్‌-19తో ఏర్పడిన సంక్షోభం కారణంగా చతికిలపడ్డ చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఊతమిచ్చి, పౌరుల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు.. అధ్యక్షుడు బైడెన్‌ గతంలో 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఉద్దీపన ప్యాకేజీ కావడం విశేషం. 

అమెరికన్‌ కాంగ్రెస్‌లో బుధవారం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. 220-211 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. డెమోక్రాట్లందరూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అత్యధిక మంది సభ్యుల నుంచి బిల్లుకు మద్దతు లభించడంతో ఆమోదం పొందినట్లు స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రకటించారు. కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందడం పట్ల బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కొద్దిసేపటికే ‘నిరుద్యోగులకు ఉపశమనం, అందరికీ టీకాలు’ అని పేర్కొంటూనే.. ‘సహాయం ఇక్కడ ఉంది’ అంటూ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ఆ బిల్లుపై బైడెన్‌ శుక్రవారం సంతకం చేయనున్నట్లు తెలిపారు. అధ్యక్షుడి సంతకం చేసిన తర్వాత ఉద్దీపన ప్యాకేజీ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ‘ఈ రోజు మనం తీసుకున్న ఈ నిర్ణయం మిలియన్ల మంది అమెరికన్ల జీవితాలను, జీవనోపాధిని కాపాడేది’ అని స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారు. 

కాగా గత శనివారమే ఉద్దీపన ప్యాకేజీ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. సెనేట్‌లో 50-49 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. రెండు సభల్లోనూ ఈ బిల్లుకు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓట్లు వేయడం గమనార్హం. ఈ బిల్లు చట్టం రూపం దాల్చిన తర్వాత కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికా పౌరులకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థికంగా ఆదుకోవడానికి ఉపకరిస్తుంది. కాగా, కరోనా వైరస్‌ మహమ్మారి పంజాకు ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా దెబ్బతింది. ఇప్పటివరకు ఆ దేశంలో మహమ్మారి ధాటికి 5.25లక్షల మందికిపైగా మరణించినట్లు జాన్‌హాప్కిన్స్‌ నివేదికలు వెల్లడించాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని