Rajasthan constable: దూసుకొస్తోన్న మంటల్లో..పసిబిడ్డతో పరిగెత్తిన కానిస్టేబుల్‌..!

ఆకస్మికంగా చెలరేగిన హింస కారణంగా ఇళ్లకు మంటలు అంటుకుంటే.. ఓ చిన్నారిని రక్షించేందుకు రాజస్థాన్‌కు చెందిన కానిస్టేబుల్ సాహసం చేశారు.

Published : 05 Apr 2022 02:09 IST

జైపూర్: ఆకస్మికంగా చెలరేగిన హింస కారణంగా ఇళ్లకు మంటలు అంటుకుంటే.. ఓ చిన్నారిని రక్షించేందుకు రాజస్థాన్‌కు చెందిన కానిస్టేబుల్ సాహసం చేశారు. చుట్టూ మంటలు చెలరేగుతున్నా, ఇరుకైన సందులగుండా వేగంగా పరిగెత్తి చిన్నారి ప్రాణం కాపాడారు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని షామిలికి చెందిన ఐపీఎస్ అధికారి సుకీర్తి మాధవ మిశ్రా నెట్టింట్లో షేర్ చేశారు. ‘ఓ విలువైన ప్రాణాన్ని కాపాడిన రాజస్థాన్‌ పోలీస్‌ నేత్రేశ్ శర్మ పట్ల గర్వంగా ఉంది. మాటల్లో వర్ణించలేని విషయాన్ని ఈ ఒక్క చిత్రం ప్రతిబింబిస్తుంది’ అంటూ ప్రశంసించారు.  

ఏప్రిల్ 2న రాజస్థాన్‌లోని కరౌలీ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. హిందూ కొత్త సంవత్సరాదిని పురస్కరించుకొని నిర్వహిస్తోన్న మోటార్‌ సైకిళ్ల ర్యాలీపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. దాంతో చెలరేగిన ఘర్షణల్లో కొందరు దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. అప్పుడు అక్కడ చిక్కుకుపోయిన చిన్నారిని రక్షించేందుకు కానిస్టేబుల్ సాహసం చేశారు. 

దీనిపై నేత్రేశ్‌ శర్మను మీడియా పలకరించింది. కొత్త సంవత్సరం రోజు నిర్వహించిన ర్యాలీ సమయంలో నేత్రేశ్ రక్షణ విధులు చూస్తున్నారు. ‘ర్యాలీ సమయంలో ఒక్కసారిగా ఎవరో రాళ్లు విసిరారు. అప్పుడు రోడ్డుపై గాయపడిన ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు ఆసుపత్రికి తీసుకెళ్లమని అభ్యర్థించగా.. నేను వారికి సహకరించాను. అప్పుడే షాపులకు నిప్పు అంటుకోగా..రెండు షాపుల మధ్య ఒక ఇల్లు ఉండటం గ్రహించాను. ఆ ఇంట్లో చేతిలో పసిబిడ్డతో మహిళలు చిక్కుకుపోయి ఉన్నారు. వెంటనే వారి దగ్గరకు పరిగెత్తాను. నన్ను చూసినవెంటనే వారు కాపాడమని అభ్యర్థించారు. నేను ఆ బిడ్డను తీసుకొని, నా వెనకాలే వారిని వచ్చేయమని చెప్పాను. అలా ఆ చిన్నారిని బయటకు తీసుకువచ్చి వారికి అప్పగించాను. ఇది కేవలం నా బాధ్యత’ అంటూ తనపై వస్తోన్న ప్రశంసలకు వినమ్రంగా సమాధానమిచ్చారు. 

ఇదిలా ఉండగా.. ఆందోళనలు అదుపు చేసేందుకు కరౌలీ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలకు పాక్షికంగా పరిమితులు పెట్టింది.  50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని