Rahul Gandhi: వారికి గాంధీ సిద్ధాంతాలు చెప్పడం సులువే.. కానీ, ఆచరించడమే కష్టం

కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి గాంధీ సిద్ధాంతాలను వల్లించడం సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం కష్టమంటూ భాజపాపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.

Published : 02 Oct 2022 16:39 IST

బెంగళూరు: గాంధీ సిద్ధాంతాలను వల్లించడం కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం కష్టమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా మహాత్ముడికి నివాళులు అర్పించిన ఆయన.. జాతిపితను చంపిన సిద్ధాంతమే గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) పేరుతో సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తోన్న రాహుల్‌.. 1927లో కర్ణాటకలో గాంధీ సందర్శించిన ఖాదీ గ్రామోదయ కేంద్రంలో నివాళులు అర్పించారు.

‘దేశం కన్న గొప్ప వ్యక్తిని గుర్తుచేసుకుంటూ నేడు నివాళి అర్పిస్తున్నాం. అహింస, ఐకమత్యం, సమానత్వం, న్యాయం అని గాంధీ చెప్పిన మార్గంలో నడుస్తూ.. భారత్‌ జోడో యాత్రను (Bharat Jodo Yatra) కొనసాగిస్తున్నాం. బ్రిటిష్‌ రాజ్‌కు వ్యతిరేకంగా గాంధీ పోరాడినట్లుగానే.. మహాత్ముడిని చంపిన సిద్ధాంతంపై మేము కూడా యుద్ధాన్ని ప్రకటించాం. అదే సిద్ధాంతం గడిచిన ఎనిమిదేళ్లుగా  దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తుండడంతోపాటు కష్టపడి సంపాదించుకున్న మన స్వేచ్ఛను హరిస్తోంది. హింసా రాజకీయాలు, అసత్య ప్రచారాలు కొనసాగుతోన్న వేళ.. వాటికి వ్యతిరేకంగా గాంధీజీ చెప్పిన సందేశాన్ని భారత్‌ జోడో యాత్రలో ప్రచారం చేస్తాం’ అని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 624 కి.మీ పూర్తిచేసుకున్న ఈ యాత్ర.. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరులో కొనసాగుతోంది. కన్యాకుమారిలో సెప్టెంబర్‌ 7న మొదలైన భారత్‌ జోడో యాత్ర కశ్మీర్‌ వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని