Green Corridor : పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థిని కోసం ‘గ్రీన్‌ కారిడార్‌’

కోల్‌కతాలో ఓ విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్లేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ‘గ్రీన్‌ కారిడార్‌’ ఏర్పాటు చేశారు. 

Updated : 26 Feb 2023 16:07 IST

కోల్‌కతా : మహా నగరాల్లో రాజకీయ నాయకులు, అధికారులు సాఫీగా ప్రయాణించడం కోసం గ్రీన్‌ కారిడార్లు (Green Corridor) ఏర్పాటు చేస్తుంటారు. అవయవాల తరలింపు కోసం కూడా ఈ విధంగా చేస్తారు. దీనికి భిన్నంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఓ విద్యార్థిని కోసం గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. ఎందుకంటే..

అది కోల్‌కతాలోని హావ్‌డా వంతెన సమీపంలో బిజీ రోడ్డు. ఓ విద్యార్థిని(Student) పాఠశాల యూనిఫాంలో ఉంది. ఆమె కళ్లలో నుంచి నుంచి నీరు ఉబికివస్తోంది. అటుగా వెళ్తున్న పలువురిని సాయం చేయాల్సిందిగా కోరుతోంది. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ దృశ్యాలను అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సౌవిక్‌ చక్రవర్తి గమనించాడు. సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఆమె వద్దకు వెళ్లాడు. ఎందుకు ఏడుస్తున్నావని ఆ విద్యార్థినిని ప్రశ్నించగా.. తాను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, శాయంబజార్‌లోని ఆదర్శ్‌ శిక్ష నికేతన్‌ పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి సాయం చేయాలని కోరింది. మీ ఇంట్లో వారు తోడు రాలేదా అని అధికారి ప్రశ్నించగా.. తన తాత చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లినట్లు తెలిపింది. దీంతో స్పందించిన ఇన్‌స్పెక్టర్‌ వెంటనే ఆ విద్యార్థినిని తన అధికారిక వాహనంలో ఎక్కించుకున్నాడు. పరీక్షా కేంద్రం వరకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాల్సిందిగా ట్రాఫిక్‌ కంట్రోల్‌కు చకచకా ఆదేశాలు జారీ చేశాడు. ఉదయం 11.30 సమయానికల్లా విద్యార్థినిని పరీక్ష కేంద్రం వద్ద విడిచిపెట్టాడు. దాంతో విద్యార్థిని చక్కగా పరీక్ష రాసేసింది. 

ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్‌ సౌవిక్‌ చక్రవర్తి మాట్లాడుతూ ‘నా కూతురు 11వ తరగతి చదువుతోంది. అందుకే ఓ విద్యార్థిని పడే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. నేను ఆమెను చూసినప్పుడు సమయం 11.20. తక్షణమే స్పందించి 11.30కల్లా ఆ విద్యార్థినిని పరీక్షా కేంద్రానికి చేర్చాను. ఆమెను అధికార వాహనంలో కాకుండా మరో వాహనంలో పంపించవచ్చు. కానీ, ఆమె సమయానికి పరీక్ష రాసేది కాదు. అందుకే కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించాను. మేము బయలుదేరి వెళ్తున్న సమయంలో ఆ విద్యార్థిని చాలా ఆందోళన చెందుతోంది. ఏం పర్లేదు. ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చానని’ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని