Train Accident: ‘కోరమాండల్‌’ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంతో ఏపీ సహా నాలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఆయా రాష్ట్రాల్లో రైల్వేశాఖ అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు.

Updated : 03 Jun 2023 03:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒడిశాలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌(Coromandel Express) రైలు దుర్ఘటన ముఖ్యంగా నాలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. పశ్చిమ్‌బెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు ఘోర ప్రమాదానికి గురికావడంతో పెను విషాదం నింపింది. సుదీర్ఘ ప్రయాణం సాగించే రైలు కావడం, రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రులు, మృతుల వివరాలు తెలియడం లేదు. కోరమాండల్‌ రైల్లో ప్రయాణించిన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 207 మందికి మృతి చెందడం, 900 మందికి పైగా క్షతగాత్రులు కావడంతో ప్రయాణికుల వివరాలు వెల్లడించడం కూడా రైల్వేశాఖ అధికారులకు కష్టతరంగా మారింది.

ఒడిశా, బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాల నుంచి నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నప్పటికీ అధికారులు.. క్షతగాత్రుల వివరాలు అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్‌ ద్వారా భువనేశ్వర్‌, ఖరగ్‌పూర్‌, కోల్‌కతాలోని ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన తరలించాలని, లేకపోతే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంటుందని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు సూచిస్తున్నారు. శుక్రవారం రాత్రి 7.15 గంటలకు ప్రమాదం జరిగితే అర్ధరాత్రి వరకు కూడా రైల్వే అధికారులు ప్రమాదానికి గురైన బోగీల వివరాలు వెల్లడించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం బోగీ నంబర్లు వెల్లడించినా కొంత వరకు సమాచారం తెలుస్తుందని భావిస్తున్నారు.

అప్రమత్తమైన నాలుగు రాష్ట్రాలు..

ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో తమ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారేమోనని పశ్చిమ్‌బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలోని అధికారులతో మిగిలిన 3 రాష్ట్రాల అధికారులు సంప్రదిస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించినట్టు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని