Corona: దిల్లీలో మళ్లీ భారీగా కొవిడ్‌ కేసులు; ఇద్దరి మృతి

దేశ రాజధాని నగరం దిల్లీలో కొవిడ్‌ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. శనివారం దాదాపు 1100లకు చేరువలో కొత్త కేసులు.......

Published : 23 Apr 2022 21:42 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కొవిడ్‌ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. శనివారం దాదాపు 1100లకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యయాయి. గడిచిన 24గంటల వ్యవధిలో దిల్లీలో 22,714 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,094 మందికి పాజిటివ్‌గా తేలినట్టు దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, కొవిడ్ బారిన పడిన వారిలో ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్చి అయ్యారు. దిల్లీ నగరంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.82గా ఉంది. మరోవైపు, కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,705కి పెరిగింది.

దిల్లీలో గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ వారం ఆర్‌-వాల్యూ (రీ-ప్రొడక్షన్‌ నంబర్‌) 2.1 దాటినట్టు ఐఐటీ మద్రాస్‌ విశ్లేషణలో వెల్లడైంది. కొవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్‌ వ్యాల్యూ ద్వారా అంచనా వేస్తారు. దీని విలువ ఒకటిగా ఉంటే.. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకుతున్నటు పరిగణిస్తారు. ఒకటి దాటిందంటే మాత్రం ప్రమాద ఘంటికలు మోగినట్లే. కానీ దిల్లీలో ఈ విలువ ఇప్పుడు 2.1కి చేరుకుంది. దేశవ్యాప్తంగా అయితే, 1.3గా ఉంది. ఐఐటీ మద్రాస్ బృందం చేసిన ప్రాథమిక విశ్లేషణలో భాగంగా ఈ విషయం వెల్లడైంది. అయితే ఇది నాలుగో వేవ్‌కు సంకేతమా అని ప్రశ్నించగా.. ‘దిల్లీలో ఆర్‌ వ్యాల్యూ రెండు కంటే ఎక్కువగా ఉంది. అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి మరో ఇద్దరికి సోకుతుందని మాత్రం మేం చెప్పగలం. మరో కొత్త వేవ్ ప్రారంభమైందని ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. ప్రజల రోగనిరోధక స్థాయుల గురించి, మూడోవేవ్‌లో ప్రభావితమైన వ్యక్తులు మళ్లీ వైరస్ బారినపడతారా అనే వాటి గురించి తెలియదు’ అని ఆ బృందం వెల్లడించింది. అలాగే ఇతర మెట్రో నగరాలైన ముంబయి, చెన్నై, కోల్‌కతాలో కేసులు తక్కువగా ఉండటంతో..తాజాగా ట్రెండ్‌పై ఒక అంచనాకు రాలేమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని