సెకండ్‌ వేవ్‌ ఇంకా పోలేదు.. అలా చేయకండి!

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఇంకా ముగిసిపోలేదని కేంద్రం మరోసారి హెచ్చరించింది. పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని.......

Updated : 10 Jul 2021 20:46 IST

 కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర హోంశాఖ విజ్ఞప్తి

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఇంకా ముగిసిపోలేదని కేంద్రం మరోసారి హెచ్చరించింది. పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని విస్మరించొద్దని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన దేశంలోని హిల్‌ స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తికి సంబంధించి  తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్టు కనబడినప్పటికీ.. రాజస్థాన్‌, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కరోనా పాజిటివి రేటు 10శాతం కన్నా ఎక్కువగానే ఉన్నట్టు చెప్పారు. 

ఈ సమావేశంలో గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కరోనా వైరస్‌తో పరిస్థితితో పాటు వ్యాక్సినేషన్‌ స్థితిపైనా చర్చించారు. పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలను విస్మరిస్తున్నట్టు మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో హెచ్చరికలు చేశారు. మహమ్మారి ఇంకా ముగిసిపోలేదన్న అజయ్‌ భల్లా.. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. టెస్టింగ్‌, ట్రాకింగ్‌‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ నిబంధనలు అమలు.. ఈ ఐదు అంచెల్ని పాటించాలని సూచించారు. ఈ సమీక్షలో నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఐసీఎంఆర్‌ డీజీ, ఎనిమిది రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.

కొవిడ్ ఆంక్షలు సడలించడంతో పలు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాల్లో జనాలు సేదతీరుతున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మూడో ముప్పు పొంచి ఉన్న వేళ.. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి, ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం, హరిద్వార్‌లోని హర్‌ కీ పౌరి ఘాట్‌వద్ద జన సమూహాల  దృశ్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య రంగ నిపుణుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని