Corona: 74 రోజుల తర్వాత 70 వేలకు కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. గత వారం రోజులుగా లక్ష దిగువనే నమోదవుతోన్న కేసులు.. నిన్న మరి కాస్త తగ్గాయి.

Updated : 14 Jun 2021 10:06 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులుగా లక్ష దిగువనే నమోదవుతోన్న కేసులు.. నిన్న మరి కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 70,421 మందికి కరోనా సోకింది. సుమారు 74 రోజుల తర్వాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం క్రితం రోజుతో పోల్చితే పెరుగుదల నమోదైంది. ఈమేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. 

నిన్న 14,92,152 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..70,421 మందికి వైరస్ సోకింది. ఏప్రిల్ ఒకటి తరవాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అయితే నిన్న నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తక్కువగానే ఉండటం కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇక నిన్న 3,921 మరణాలు రికార్డయ్యాయి. పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో మృతుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రస్తుతం  మొత్తం కేసులు 2.95కోట్లకు పైబడగా..3,74,305 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక క్రియాశీల కేసులు 10లక్షల దిగువకు పడిపోగా..రికవరీలు 2.81కోట్లకు చేరాయి. నిన్న ఒక్కరోజే 1,19,501 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95.43 శాతానికి పెరగ్గా..క్రియాశీల రేటు 3.30 శాతానికి తగ్గింది. మరోపక్క నిన్న 14,99,771 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు ప్రజలకు అందిన టీకాల సంఖ్య 25,48,49,301గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని