Corona Updates: ముంబయిలో 10వేల కేసులు.. కొవిడ్‌సునామీలా వచ్చినాఎదుర్కొనేందుకు రె‘ఢీ’!

భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ ప్రవేశించాక రోజురోజుకీ కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి......

Published : 04 Jan 2022 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ ప్రవేశించాక రోజురోజుకీ కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క ముంబయి నగరంలోనే ఈరోజు 10వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో కఠిన ఆంక్షలు మరోసారి అమలులోకి వస్తున్నాయి. మూడో ముప్పు మొదలైందన్న కొందరు నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని పలుచోట్ల కరోనాకు సంబంధించి కొన్ని అప్‌డేట్‌లు..

ముంబయిలో ఒకే రోజు 10వేలకు పైగా కేసులు
ముంబయిలో కరోనా మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 49,661శాంపిల్స్‌ పరీక్షించగా.. 10,860 మందిలో కొవిడ్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వీరిలో 89శాతం మందిలో లక్షణాల్లేవని అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ బారినపడినవారిలో 834మంది ఆస్పత్రిలో చేరినట్టు అధికారులు తెలిపారు. కొత్తగా 654మంది కోలుకోగా.. ఇద్దరు మరణించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబయిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 47,476కి పెరిగింది.


కరోనా సునామీని ఎదుర్కొనేందుకు మేం రెడీ!

కరోనా కేసులు సునామీలా వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ముంబయి మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ అన్నారు. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిలో గత కొన్ని రోజులుగా భారీగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. డెల్టా రకం కన్నా అత్యంత వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. థర్డ్‌వేవ్‌కు సిద్ధంగానే ఉన్నామనీ.. లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఆస్పత్రులలో 30వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జంబో కొవిడ్‌ సెంటర్లు కూడా సిద్ధమేననీ.. కరోనా కేసులు సునామీలావచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. 


రణ్‌దీప్‌ సూర్జేవాలాకు కరోనా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా కరోనా బారినపడ్డారు. రాత్రి నుంచి తనకు స్వల్ప జ్వరం, దగ్గు రావడంతో పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. గడిచిన 24గంటల వ్యవధిలో తనతో కాంటాక్టు అయినవారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకొని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 


ఆ నౌకలో కొవిడ్‌ బాధితులంతా ముంబయికి.. 

ముంబయి నుంచి గోవాకు 2వేల మందితో వెళ్లిన కార్డెలియా క్రూజ్‌ నౌకలో కొవిడ్ బారినపడిన 66మంది ప్రయాణికుల్ని ముంబయి పోర్టుకు తరలించారు. బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) బృందం అక్కడికి చేరుకొని ప్రయాణికులతో పాటు సిబ్బందికి స్క్రీనింగ్‌ నిర్వహించనున్నారు. పాజిటివ్‌గా తేలినవారందరికీ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష నిర్వహించనున్నారు. వారికి నెగెటివ్‌ వచ్చేదాకా బయటకు విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. క్రూజ్‌ నౌకలో ఆదివారం ఒక కేసు రాగా.. నిన్న మరింతమందికి పరీక్షలు చేయగా 66మందిలో ఈ వైరస్‌ ఉన్నట్టు బయటపడిన విషయం తెలిసిందే.


యూపీలో మరో 16 ఒమిక్రాన్‌ కేసులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒమిక్రాన్‌ కలకలం రేపుతోంది. మంగళవారం ఒక్కరోజే 16 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 26కి చేరింది. అలాగే, తాజాగా 992 కొవిడ్‌ కేసులు రావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3173కి పెరిగింది. 


కోల్‌కతాలో 80మందికి పైగా పోలీసులకు కరోనా

బెంగాల్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. నిన్న 100 మందికి పైగా వైద్యులకు ఈ మహమ్మారి సోకగా.. తాజాగా కోల్‌కతాలో 83 మంది పోలీసులు కొవిడ్‌ బారినపడ్డారు. వీరిలో ఐపీఎస్‌ ర్యాంకు అధికారులు కూడా ఉన్నారు. మొత్తం 83మంది బాధితుల్లో 47మంది హోం ఐసోలేషన్లో ఉండగా.. 16మంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.


ప్రతి 2,3 రోజులకు కేసులు డబుల్‌ అవుతున్నాయ్‌.. 
రాష్ట్రంలో ప్రతి రెండు మూడు రోజులకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ అన్నారు. కర్ణాటకలో కొత్తగా 2479 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. తాజాగా 288మంది కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,532కి పెరిగింది. 


Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని