కాలిఫోర్నియాలో మరణమృదంగం

అమెరికాలోని కాలిఫోర్నియాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది.

Updated : 02 Jan 2021 14:37 IST

25 వేలు దాటిన మరణాలు

లాస్‌ ఏంజెలెస్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య గురువారం 25 వేల మార్కును దాటింది. న్యూయార్క్‌(38 వేలు), టెక్సాస్‌(27 వేలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల అనంతరం కాలిఫోర్నియాలో కొత్త కేసులు, మరణాలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు ఇక్కడ రెండో దశ వ్యాప్తి మొదలై, బాధితుల్లో ఉత్పరివర్తన చెందిన వైరస్‌ కనిపిస్తోంది. ఈ కొత్త వైరస్‌కు మునుపటి కంటే వేగంగా వ్యాపించే లక్షణం ఉండటం మరింత ఆందోళన రేపుతోంది. కాలిఫోర్నియాలో నమోదైన మొత్తం మరణాల్లో 40 శాతం ఒక్క లాస్‌ఏంజెలెస్‌ నగరంలోనివే. ఈ కౌంటీలో ప్రతి గంటకు సగటున ఆరుగురు కొవిడ్‌తో చనిపోతున్నారు. ఒకానొక దశలో ఇక్కడ ఒకేరోజు 290 మరణాలు నమోదయ్యాయి. అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు మరణించారు. ఇప్పటికీ ఆస్పత్రులపై ఒత్తిడి విపరీతంగా ఉంది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు ఐసీయూ పడకలు దొరకడం లేదు. రోగుల్ని వీల్‌ఛైర్‌లో, హాళ్లలోనే ఉంచి వైద్యం చేస్తున్నారు. ఎక్కువశాతం రోగుల్లో శ్వాస సమస్యలు ఉండటంతో ఆక్సిజన్‌ కొరత తలెత్తుతోంది. డిశ్చార్జ్‌ అవుతున్న రోగులు ఆక్సిజన్‌ సిలిండర్లు ఇంటికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆస్పత్రుల ముందు అంబులెన్సులు వరుస కడుతున్నాయి. వాటిల్లోని రోగుల్ని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లేందుకు 8 గంటల సమయం పడుతోంది. అత్యవసర సందర్భాల్లో అంబులెన్స్‌ల్లోనే వైద్యులు చికిత్స చేస్తున్నారు.  
సిలికాన్‌ వ్యాలీలో కాస్త ఊరట
సిలికాన్‌ వ్యాలీ ఉండే శాంతాక్లారా కౌంటీలో మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడి ఆస్పత్రుల్లో 8 శాతం ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇదెంతో వెసులుబాటని కౌంటీ ఆరోగ్య సంరక్షణ సంసిద్ధత డైరెక్టర్‌ డా.అహ్మద్‌ కమాల్‌ చెప్పారు. 

ఇవీ చదవండి...

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ టీకా డ్రైరన్‌

ఫైజర్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌వో అత్యవసర అనుమతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని