Vaccine Trials: 2-6 ఏళ్ల వారికి రెండో డోసు!

భారత్‌లో చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో మరో ముందడుగు పడనుంది. 2 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లల కోసం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా సామర్థ్యాన్ని తెలుసుకునే....

Published : 19 Jul 2021 19:37 IST

దిల్లీ: భారత్‌లో చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో మరో ముందడుగు పడనుంది. 2 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లల కోసం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా రెండో డోసును వచ్చే వారంలో ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ప్రయోగాల నివేదికను ఆగస్టు చివరిలోగా సిద్ధం చేసి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు సమర్పించనున్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో జరుగుతున్న ఈ పరీక్షల్లో భాగంగా జూన్‌లోనే 2-6 ఏళ్లలోపు చిన్నారులకు మొదటి డోసు అందించారు. 6-12 ఏళ్లలోపు పిల్లలకు రెండో డోసు కూడా ఇచ్చినట్లు సమాచారం.

దేశానికి మూడో ముప్పు పొంచిఉందని.. అది పిల్లలపై అధిక ప్రభావం చూపబోతోందని అందిన హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం పిల్లలపై కూడా టీకా ప్రయోగాల నిర్వహణకు అనుమతించింది. ఇందులో భాగంగా 12 నుంచి 18ఏళ్ల వారిపై ప్రయోగాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 18 ఏళ్లలోపు వారికి కొవిడ్ వ్యాక్సిన్ల తయారీలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే దిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా పిల్లలకు టీకా అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా గతంలోనే వెల్లడించారు.

కరోనాను ఎదుర్కొనేందుకు 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లల కోసం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను రూపొందించింది. వీటికి సంబంధించిన రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా పిల్లలపై మూడు విభాగాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాలను మొత్తం 525 మంది చిన్నారులపై చేపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని