వైరస్‌ను తేలికగా తీసుకోవడమే అత్యంత ప్రమాదం!

కరోనా వైరస్‌ మహమ్మారి పట్ల ప్రజలు తేలిక భావన కలిగి ఉండడం అత్యంత ప్రమాదకరమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి గొలుసును తెంచడంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం అతిపెద్ద సాధనమని పునరుద్ఘాటించారు.

Published : 16 Apr 2021 20:16 IST

నిబంధనలు పాటించడమే కరోనాకు విరుగుడు
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి పట్ల ప్రజలు తేలిక భావన కలిగి ఉండడం అత్యంత ప్రమాదకరమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి గొలుసును తెంచడంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం అతిపెద్ద సాధనమని పునరుద్ఘాటించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం వైరస్‌పై మనకు పూర్తి అవగాహన కలిగిందని.. ఈ నేపథ్యంలో వైరస్‌ని కట్టడి చేయడం సాధ్యమేనన్నారు.

దేశంలో రెమ్‌డెసివిర్‌ ఔషధం కొరత ఉందని వస్తోన్న వార్తలపై స్పందించిన ఆయన.. ఔషధ ఉత్పత్తిని భారీగా పెంచాలని ఇప్పటికే ఆయా ఫార్మా సంస్థలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ను ఎవరైనా నల్లబజారులో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించామన్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ తీవ్రత అధికమవుతోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో శనివారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వైరస్‌ గురించి పూర్తి అవగాహన లేని సమయంలోనే మహమ్మారిపై విజయం సాధించామని.. గతేడాదితో పోలిస్తే వైరస్‌ తీవ్రత, దాని ప్రవర్తనపై మనకు పూర్తి అవగాహన వచ్చిందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఎన్‌95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఇక దేశవ్యాప్తంగా 52 జిల్లాల్లో గత వారం నుంచి కొత్త కేసులు లేవని.. 34 జిల్లాల్లో 14రోజులుగా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మూడు వారాలుగా నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా వెలుగు చూడలేదని.. 44జిల్లాల్లో 28 రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోన్న వేళ అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో పడకలు, మెడికల్‌ ఆక్సిజన్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు