Covid: అణ్వాయుధాల కంటే భారీ నష్టం చేసింది

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ పుట్టుక వెనుక నిజం మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి విలయానికి చైనానే కారణమని, ఈ వైరస్‌ను

Published : 01 Jun 2021 11:21 IST

కరోనా పుట్టుక ఎప్పటికీ తెలియకపోవచ్చన్న ఆనంద్‌ మహీంద్రా 

ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ పుట్టుక వెనుక నిజం మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి విలయానికి చైనానే కారణమని, ఈ వైరస్‌ను ఆ దేశ శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో సృష్టించినట్లు బలం చేకూర్చే అధ్యయనం ఒకటి తాజాగా వెలువడిన విషయం తెలిసిందే. ఈ కథనంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మహీంద్రా.. కొవిడ్‌ అణ్వాయుధాల కంటే భారీ నష్టం కలిగించిందని అన్నారు.

‘కరోనా.. చైనా శాస్త్రవేత్తల సృష్టే’ అనే పేరుతో ఉన్న ఓ మీడియా కథనాన్ని ట్వీట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా.. ‘‘నిజాన్ని మనం ఎప్పుడూ తెలుసుకోలేకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం లాంటి జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందాన్ని చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వైరస్‌ ఇప్పటికే యావత్‌ ప్రపంచానికి అణ్వాయుధం కంటే ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది’’ అని పేర్కొన్నారు.

కరోనా ప్రపంచాన్ని చుట్టి ఏడాది గడిచినా ఇంకా దాని మూలాలు అంతుచిక్కకుండానే ఉన్నాయి.  చైనాలోని వుహాన్‌ నగరంలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ నుంచే ఇది లీకై ఉంటుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కరోనా మొదటి కేసులు కూడా ఆ ల్యాబ్‌కు సమీపంలోని సీఫుడ్‌ మార్కెట్‌లో వెలుగు చూడటం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలో మరోసారి వుహాన్‌ ల్యాబ్‌ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ మరో పరిశోధన ఇటీవల వెలుగు చూసింది. సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిష్‌, నార్వే శాస్త్రవేత్త బిర్గర్‌ సొరెన్‌సెన్‌ తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు బ్రిటన్‌ పత్రిక ‘డైలీ మెయిల్‌’లో ఒక కథనం వచ్చింది.  చైనాలోని గుహల్లోని గబ్బిలాల్లో ఉండే సహజసిద్ధ కరోనా వైరస్‌లోని ‘వెన్నెముక’ను సేకరించి, దానిలోకి కొత్త ‘స్పైక్‌’ను చొప్పించారని వీరు తెలిపారు. తద్వారా ఈ వైరస్‌ ప్రమాదకరంగా, తీవ్రంగా వ్యాపించేలా రూపాంతరం చెందిందన్నారు. దీన్ని ల్యాబ్‌లోనే సృష్టించారనడానికి కొవిడ్‌-19 నమూనాల్లో తాము ‘ప్రత్యేక సంకేతాల’ను గుర్తించామని కూడా చెప్పారు. పూర్తి నివేదిక మరికొన్ని రోజుల్లోనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురితం కానుంది.

ఈ మహమ్మారి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 35.65లక్షల మందిని బలితీసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక మరణాలు చోటుచేసుకోగా.. 3లక్షల పైచిలుకు మరణాలతో భారత్‌ రెండోస్థానంలో ఉంది. గత కొద్ది రోజులుగా దేశంలో రెండో దశ ఉద్ధృతి కొనసాగగా.. ఇప్పుడిప్పుడే కేసులు కాస్త తగ్గుమఖం పడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని