భారత్‌లో 3 లక్షలు దాటిన కొవిడ్‌ మరణాలు

కరోనా వైరస్‌ మహమ్మారి విలయానికి యావత్‌ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 34లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు.

Updated : 23 May 2021 22:18 IST

కొవిడ్‌ మరణాల్లో ప్రపంచంలో మూడో స్థానం..

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విలయానికి అన్ని దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 34లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. వీటిలో అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా మూడు లక్షల మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. ఆయా రాష్ట్రాలు వెల్లడించిన నివేదికల ప్రకారం, దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య ఆదివారం నాటికి మూడు లక్షలు దాటింది.

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌తో విలయతాండవం చేస్తున్న వేళ.. భారత్‌లో నిత్యం దాదాపు 4వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధిక కొవిడ్ మరణాలు మహారాష్ట్రలో సంభవిస్తుండగా.. తాజాగా కర్ణాటకలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 626 కరోనా మరణాలు నమోదయ్యాయి. మొన్నటివరకు మహారాష్ట్రలో నిత్యం దాదాపు 900 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా ఆసంఖ్య 600 దిగువకు చేరింది. ఆదివారం నాడు మహారాష్ట్రలో 594 కరోనా మరణాలు రికార్డయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, ఆదివారం ఉదయానికి దేశవ్యాప్తంగా 2లక్షల 99వేల కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. తాజాగా ఆయా రాష్ట్రాలు ప్రకటించిన రోజువారీ నివేదికలతో దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 3లక్షల దాటింది.

మూడో స్థానంలో భారత్‌...

ప్రపంచంలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అత్యధిక కరోనా మరణాలు అమెరికాలో (5,89,000) చోటుచేసుకున్నాయి. కరోనా తీవ్రత అత్యంత ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌లో కొవిడ్‌ మరణాలు 4లక్షల 48వేలు దాటాయి. కరోనా పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ సంఖ్య 3 లక్షల మార్కును దాటింది. మెక్సికోలో 2లక్షల 22 వేల మంది ప్రాణాలు కోల్పోగా, బ్రిటన్‌లో లక్షా 27వేల మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 34 లక్షల 55వేల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని