UNICEF: టీపీటీ టీకాకు 2.30 కోట్ల మంది పిల్లలు దూరం

ప్రపంచవ్యాప్తంగా డిప్తీరియా-టెటానస్-పెర్ట్యూసిస్ (డీపీటీ) టీకా మొదటి డోసు వేసుకోని చిన్నాల సంఖ్య రికార్డుస్థాయిలో భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు యునిసెఫ్ వెల్లడించింది....

Published : 18 Jul 2021 01:27 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా డిప్తీరియా-టెటానస్-పెర్ట్యూసిస్ (డీపీటీ) టీకా మొదటి డోసు వేసుకోని చిన్నాల సంఖ్య రికార్డుస్థాయిలో భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు యునిసెఫ్ వెల్లడించింది. ఈ టీకాను మూడు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుందని.. కరోనా పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.30 కోట్ల మంది చిన్నారులు ఈ టీకాకు దూరమయ్యారని పేర్కొంది. భారత్‌లో డీపీటీ తీసుకోని చిన్నారుల సంఖ్య 30 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించింది. 2019లో టీకా వేసుకోని చిన్నారుల సంఖ్య 19 లక్షలుగా ఉంటే.. కొవిడ్ వల్ల 2020లో ఆ సంఖ్య 30 లక్షలకు పెరిగినట్లు యునిసెఫ్  వివరించింది. టీకా తీసుకోనివారిలో మారుమూల ప్రాంతాలు, మురికి వాడల్లో నివసించేవారి పిల్లలే పెద్దసంఖ్యలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందటం లేదని తెలిపింది.

పిల్లలకు డిప్తీరియా, పెర్ట్యూసిస్‌, టెటానస్ వ్యాధులు సోకకుండా మూడో డోసుల్లో టీకాలు అందిస్తారు. కాగా భారత్‌లో 2020లో 30,38,000 మంది పిల్లలు డీపీటీ మొదటి డోసు తీసుకోలేదని యునిసెఫ్‌ వెల్లడించింది. 2019లో ఈ సంఖ్య 14,03,000గా ఉన్నట్లు తెలిపింది. కరోనా కారణంగా పలు దేశాల్లోని ఆసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేయడం, టీకాలు ఇస్తుండటంతో.. కరోనా సోకుతుందేమోనని పిల్లలను టీకాల కోసం ఆసుపత్రులకు తీసుకురాకపోవడమే ఈ తగ్గుదలకు కారణమని పేర్కొంది. మరికొన్ని దేశాల్లో క్లినిక్‌లను మూసివేయడం, లాక్‌డౌన్‌ కారణంగా మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు తగ్గిపోవడం కూడా కారణాలుగా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని