12 రోజుల్లోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు!

రోజువారీగా బయటపడుతోన్న కరోనా పాజిటివ్‌ రేటు గణనీయంగా పెరిగింది. కేవలం 12రోజుల్లోనే ఇది రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 18 Apr 2021 18:03 IST

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: కరోనా రెండో దఫా విజృంభణతో పాజిటివ్‌ కేసుల సంఖ్య విస్తృత వేగంతో పెరిగిపోతున్నాయి. దీంతో రోజువారీగా బయటపడుతోన్న కరోనా పాజిటివ్‌ రేటు గణనీయంగా పెరిగింది. కేవలం 12రోజుల్లోనే ఇది రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌ 6 తేదీన 8శాతంగా ఉన్న కొవిడ్‌ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.69శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 12రోజుల్లోనే రెట్టింపు అయినట్లు పేర్కొంది. ఇక గత నెలలో 3.05శాతం ఉన్న పాజిటివిటీ రేటు, ప్రస్తుతం 13.54శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వారపు పాజిటివిటీ రేటు అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో 30.38 శాతం నమోదుకాగా, గోవా(24.24%), మహారాష్ట్ర(24.17%), రాజస్థాన్‌(23.33%), మధ్యప్రదేశ్‌(18.99%) రాష్ట్రాల్లో అధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక దిల్లీలోనూ గడిచిన 24గంటల్లో కరోనా కేసుల సంఖ్య 25వేలు నమోదయ్యాయి. దీంతో అక్కడి పాజిటివిటీ రేటు 30శాతానికి చేరుకుంది.

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2.61లక్షల పాజిటివ్‌ కేసులు, 1501 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 18లక్షలకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు ఎక్కువగా పది రాష్ట్రాల్లోనే ఉంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 78.56శాతం కేసులు కేవలం ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని