షాపుల బయట గుమిగూడితే మేమేం చేస్తాం?

రాజధాని నగరంలోని మార్కెట్లలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ అక్కడి హైకోర్టు వ్యాఖ్యానించడంపై దిల్లీ వ్యాపారుల సంఘం స్పందించింది

Published : 23 Jun 2021 00:03 IST

దిల్లీ: రాజధాని నగరంలోని మార్కెట్లలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ అక్కడి హైకోర్టు వ్యాఖ్యానించడంపై దిల్లీ వ్యాపారుల సంఘం స్పందించింది.  దుకాణాల బయట జనం గుమిగూడితే తామేం చేయగలమని కోర్టుకు తెలిపింది. మార్కెట్‌ పరిసరాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, దానికి వ్యాపారులేం చేయలేరని వివరించింది. దుకాణాల బయట ఉన్న వ్యక్తులను నియంత్రించడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం సమాజ శ్రేయస్సు కోసం వ్యాపారులు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని  పేర్కొంది. లేదంటే కరోనా మూడోదశ వ్యాప్తి సంభవించే ప్రమాదముందని హెచ్చరించింది.  

రద్దీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  ఈ విషయంపై చర్చించేందుకు అధికారులు, వ్యాపారులు సమావేశమవ్వాలని తెలిపింది. ఇటీవల కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో దుకాణాలు, వ్యాపార సమూహాలు తెరచుకునేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.  దిల్లీ వ్యాపారుల సమాఖ్య ఛైర్మన్‌ బ్రిజేష్‌ గోయల్‌ ఈ విషయంపై మాట్లాడుతూ.. దుకాణాల్లో జనం గుమిగూడకుండా చూసే బాధ్యత ఆ యజమానికి ఉంటుంది కానీ, బయటి ప్రజలను ఆయనెలా నియంత్రించగలడని అన్నారు. మార్కెట్‌ పరిసరాల్లో జనాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులే తీసుకోవాలని అన్నారు. అధికారులకు వ్యాపారస్తులు కూడా సహకరిస్తారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని