టెలివిజన్‌ చట్టాల్లో మార్పులు అవసరం..

హింసను ప్రేరేపించే విధంగా ప్రసారమయ్యే టెలివిజన్‌ కార్యక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి సూచించింది. టెలివిజన్‌కు సంబంధించిన చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరముందని సుప్రీం ఈ సందర్భంగా ప్రస్తావించింది.

Updated : 28 Jan 2021 16:52 IST

కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు

దిల్లీ: హింసను ప్రేరేపించే విధంగా ప్రసారమయ్యే టెలివిజన్‌ కార్యక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి సూచించింది. టెలివిజన్‌కు సంబంధించిన చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరముందని సుప్రీం ఈ సందర్భంగా ప్రస్తావించింది. గతేడాది దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు టీవీ ఛానెల్స్‌ ఈ అంశాన్ని వక్రీకరించి ప్రసారం చేశాయని జమైత్‌ ఉలేమా-ఐ హింద్‌, పీస్‌ పార్టీ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌కు నోటీసులు పంపింది. ‘‘ సరైన సమాచారాన్ని ప్రజలకు అందించడం తప్పు కాదు. కానీ దాన్ని ప్రజలకు చేరవేసే విధానంలోనే అసలు సమస్య ఉంటుంది. లా అండ్‌ ఆర్డర్‌ను సరైన రీతిలో ఉంచేందుకు హింసను ప్రేరేపించే ప్రసారాలను నిలుపుజేయడం చాలా ముఖ్యం. కానీ ప్రభుత్వం ఈ అంశంపై ఏ విధమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఏ ఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌ సభ్యులుగా ఉన్నారు.

హింసను ప్రేరేపించే కొన్ని టెలివిజన్‌ ప్రసారాలను తాము నిలిపేశామన్న కేంద్రం వాదనపై సుప్రీం అసంతృప్తిని వ్యక్తం చేసింది. గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో ఆందోళనలు చెలరేగటంతో కేంద్రం దిల్లీలో ఇంటర్నెట్‌ను సేవలను స్తంభింపజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఉదహరించింది. ‘‘ నిన్న గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా దిల్లీలో ఇంటర్నెట్‌ను ఆపేశారు. మీ దృష్టి రైతులపై లేదు. మొబైల్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ను ఆపేశారు. ఇదే అసలు సమస్య.’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ప్రస్తుతమున్న ‘కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌’ లో సమూల మార్పులు చేయాలి అని సుప్రీం పేర్కొంది. ప్రభుత్వం ఇటువంటి హింసాత్మక ఘటనల ప్రసారాలను నిలిపేసిన కేసుల సంఖ్యను ధర్మాసనానికి సమర్పిస్తానని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.

ఇవీ చదవండి..

ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి

సీబీఎస్‌ఈ పరీక్షలు షెడ్యూల్‌ ఎప్పుడంటే?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని