Mumbai: పేజీకో కరెన్సీ నోటు.. పుస్తకంలో రూ.74లక్షలు

అధికారుల కళ్లుగప్పి విదేశీ కరెన్సీని దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడో వ్యక్తి. పుస్తకం పేజీల మధ్య నోట్లను దాచిపెట్టగా.. తనిఖీల్లో బయటపడింది.

Updated : 24 Jan 2023 14:33 IST

ముంబయి: ఎంత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నా.. అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతూ.. అధికారులకు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా దేశానికి అక్రమంగా విదేశీ కరెన్సీ, బంగారం తీసుకొస్తున్న ఇద్దరు విదేశీయులను ముంబయి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు (Customs Officials) పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో వీరిని అరెస్టు చేశారు.

జనవరి 22 అర్ధరాత్రి తర్వాత ముంబయి (Mumbai) ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ విదేశీ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కన్పించడంతో అతడి లగేజీని పరిశీలించారు. ఈ తనిఖీల్లో రెండు పుస్తకాల్లో దాచిన డాలర్ల కట్టలు బయటపడ్డాయి. అధికారుల కళ్లుగప్పేందుకు పుస్తకాల పేజీల మధ్య నోట్లను అతికించాడు. ఈ పుస్తకాల్లో మొత్తం 90వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.74లక్షలు)ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి ప్రయాణికుడి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు బయటపెట్టగా.. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదే ఎయిర్‌పోర్టులో మరో విదేశీ ప్రయాణికుడి నుంచి 2.5కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ఆ బంగారాన్ని పేస్ట్‌ రూపంలో దాచి తీసుకురాగా.. తనిఖీల్లో బయటపడింది. దీంతో అతడిని అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని