Cyber security breach: వాట్సాప్ వేదికగా.. దేశ సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన..!

భారత నిఘా వర్గాలు మంగళవారం ఆందోళనకర విషయాన్ని గుర్తించాయి. దేశ సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్లు వెల్లడించాయి.

Updated : 19 Apr 2022 13:39 IST

దిల్లీ: భారత నిఘా వర్గాలు మంగళవారం ఆందోళనకర విషయాన్ని గుర్తించాయి. దేశ సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్లు వెల్లడించాయి. సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానాస్పద సంబంధాలు కలిగిఉన్నట్లు పేర్కొన్నాయి. 

‘కొంతమంది సైనికాధికారుల ప్రమేయం ఉన్న సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనను నిఘా వర్గాలు, సైన్యం గుర్తించాయి. ఇది పొరుగుదేశాల గూఢచర్య కార్యకలాపాలతో ముడిపడి ఉండొచ్చు. వాట్సాప్ గ్రూప్‌ల వేదికగా ఈ ఉల్లంఘన జరిగింది’ అని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించామని, దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు తప్పవని పేర్కొన్నాయి. కేసు సున్నితత్వం కారణంగా మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే ఎటువంటి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని అభ్యర్థించారు. 

ఇటీవల కాలంలో మన సైన్యం కార్యకలాపాలను తెలుసుకునేందుకు అనుమానిత పాక్‌, చైనా నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం మన అధికారుల నుంచి సున్నిత సమాచారాన్ని పొందేందుకు సోషల్‌ మీడియాను వేదిక చేసుకుంటున్నాయి. శత్రు దేశాల ప్రయత్నాలు చాలా వరకు విఫలమైనప్పటికీ.. వీరి ఉచ్చులో పడిన కొందరు అధికారుల నుంచి కొంత సమాచారం పొందినట్లు తెలుస్తోంది. ఈ తరహా కేసుల్ని అరికట్టేందుకు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మార్గదర్శకాలను అనుసరించాలని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని