Cyclone Biparjoy: 48 గంటల్లో కేరళకు నైరుతి రాక.. IMD అంచనా

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల (Southwest Monsoon)పై వాతావరణ మార్పుల ప్రభావం పడింది. అయితే మరో రెండు రోజుల్లో నైరుతి కేరళను తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

Updated : 07 Jun 2023 16:44 IST

దిల్లీ: నైరుతి రుతుపవనాలపై ఈసారి వాతావరణ ప్రభావం పడింది. దీంతో ఈ ఏడాది రుతుపవనాలు ఇంకా దేశంలోకి ప్రవేశించలేదు. అయితే తాజాగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన  ‘బిపోర్‌జాయ్‌’ తుపాను (Cyclone Biparjoy) కారణంగా ఈ రుతుపవనాలు ఆలస్యమవ్వొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై భారత వాతావరణ శాఖ స్పందించింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందంటూ చల్లని కబురు చెప్పింది. ‘‘రుతుపవనాల రాకకు దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రానున్న 48 గంటల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముంది’’ అని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అంతకుముందు రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశముందంటూ ప్రైవేటు వాతావరణ శాఖ స్కైమెట్ అంచనా వేసింది. ‘‘నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఇప్పటికే ఆరు రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) కారణంగా.. ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2 - 3 రోజులు పట్టే అవకాశముంది’’ అని స్కైమెట్‌ తెలిపింది. గతేడాది జూన్‌ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. తొలుత జూన్‌ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినా.. 7వ తేదీ వచ్చినా రుతుపవనాల ఆచూకీ కన్పించట్లేదు. ఇప్పుడు తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని అంచనా.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం

ఇక, అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను వేగంగా బలపడుతోంది. తీవ్ర తుపానుగా మారిన బిపోర్‌జాయ్‌.. బుధవారం ఉదయం 5.30 గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన - నైరుతి ప్రాంతంలో, ముంబయికి 1,000 కిలోమీటర్ల దూరంలో నైరుతిలో, పోర్‌బందర్‌కు 1,070 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన - నైరుతిలో, కరాచీకి 1,370 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తరాన - వాయువ్య దిశలో కదిలే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ తుపాను కారణంగా అరేబియా తీర ప్రాంతాలకు ఎలాంటి పెను ముప్పు లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని