Rafale jets: రఫేల్​పై మళ్లీ దుమారం.. ముడుపులపై కీలక ఆధారాలు!

రఫేల్​ ఒప్పందంలో అవకతవకలకు ఆధారాలు ఉన్నాయంటూ ఫ్రాన్స్​కు చెందిన​ ఓ జర్నల్‌ సంచలన వార్తను ప్రచురించింది. భారత్​తో రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరేలా చూసేందుకు......

Published : 08 Nov 2021 23:37 IST

దిల్లీ: రఫేల్​ ఒప్పందంలో అవకతవకలకు ఆధారాలు ఉన్నాయంటూ ఫ్రాన్స్​కు చెందిన​ ఓ జర్నల్‌ సంచలన వార్తను ప్రచురించింది. భారత్​తో రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరేలా చూసేందుకు.. దసో ఏవియేషన్​ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చిందంటూ ‘మీడియాపార్ట్​’ జర్నల్​ పేర్కొంది. ఇందుకోసం బోగస్ ఇన్​వాయిస్​లు రూపొందించిందని వెల్లడించింది. దసో ఏవియేషన్​.. ఓ మధ్యవర్తికి 7.5 మిలియన్​ యూరోల (దాదాపు రూ. 65కోట్లు) ముడుపులను రహస్యంగా అందించేందుకు ఈ ఇన్​వాయిస్​లు ఉపయోగపడ్డాయని ఆరోపించింది. 36 రఫేల్​ యుద్ధ విమానాల కోసం కుదిరిన రూ. 59వేల కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయా? అనే అంశంపై దర్యాప్తు చేసేందుకు ఫ్రాన్స్​ ప్రభుత్వం జులైలో ఓ న్యాయమూర్తిని నియమించిందని మీడియాపార్ట్​ పేర్కొంది.

బోగస్​ ఇన్​వాయిస్​కు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టలేదని ఆరోపించింది. ‘భారత్​తో రఫేల్​ ఒప్పందం కుదిరేలా చూసేందుకు దసో ఏవియేషన్​ ఓ మధ్యవర్తికి 7.5మిలియన్​ యూరోల ముడుపులు చెల్లించింది. వీటి కోసం బోగస్​ ఇన్​వాయిస్‌లను రూపొందించారు. ఆ మధ్యవర్తి పేరు సుశేన్​ గుప్తా. భారత్​లోని సీబీఐ, ఈడీలోని కొందరికి ఈ విషయం తెలుసు. 2018 అక్టోబర్​లోనే వారికి ఆధారాలు లభించాయి. కానీ ఈ విషయంలో ముందుకెళ్లాలని వారు భావించలేదు’ అని మీడియాపార్ట్​ పేర్కొంది.

స్పందించని భారత రక్షణశాఖ, దసో ఏవియషన్​

మీడియాపార్ట్​ ఆరోపణలపై భారత రక్షణశాఖ, దసో ఏవియషన్​ ఇంకా స్పందించలేదు. ఒప్పందంపై గతంలో వచ్చిన ఆరోపణలను రెండు వర్గాలు ఇప్పటికే ఖండించాయి. రఫేల్​ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ.. 2019లో భారత సుప్రీంకోర్టు కూడా సంబంధిత పిటిషన్లను కొట్టివేసింది.

2016లో ఒప్పందం..

భారత వాయుసేనను పటిష్ఠం చేయడంలో భాగంగా 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్‌ 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.59 వేల కోట్లు. విమానాలను దసో ఏవియేషన్​ సంస్థ తయారు చేస్తోంది. రఫేల్‌ శ్రేణిలో తొలి అయిదు యుద్ధ విమానాలు గతేడాది జులై 29న భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 36 రఫేల్‌ విమానాలు భారత్‌కు అందాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని