Lalu Prasad Yadav: లాలూకి కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె..!

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడిని జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్యా కిడ్నీని లాలూకు అమర్చనున్నారు.

Updated : 10 Nov 2022 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. రోహిణీ సింగపూర్‌లో నివసిస్తున్నారు. లాలూ అక్టోబర్‌లో సింగపూర్‌ వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. వారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవాలని ఆయనకు సూచించారు. దీంతో తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు రోహిణి ముందుకొచ్చారు. తన ప్రాణం కాపాడుకొనేందుకు కుమార్తె కిడ్నీని స్వీకరించేందుకు లాలూ నిరాకరించినట్లు సమాచారం. కానీ, కుమార్తె ఒత్తిడి చేయడంతో పాటు, కుటుంబ సభ్యుల కిడ్నీని అమరిస్తే శస్త్రచికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన అంగీకరించాల్సి వచ్చింది. ఆపరేషన్‌ కోసం లాలూ నవంబర్‌ 20-24 మధ్య సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది.

గత కొన్నేళ్లుగా తన కిడ్నీ, గుండె సమస్యలకు లాలూ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్లు ఆయనకు కిడ్నీ మార్పిడిని సూచించలేదు. కానీ, తండ్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందిన రోహిణి.. ఆయన్ను సింగపూర్‌లోని వైద్య బృందానికి చూపించింది. వారు లాలూకు కిడ్నీ మార్పిడి సూచించారు. లాలూ కిడ్నీ ఆపరేషన్‌ నవంబర్లో జరుగుతుందని ఆయన కుమారుడు, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం లాలూ దిల్లీలోని తన పెద్ద కుమార్తె మీసాభారతి ఇంట్లో ఉంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని