
Vaccination: ప్రికాషన్ డోసుకు ఏ టీకా?.. చర్చల తర్వాతే స్పష్టత!
దిల్లీ: ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్తోపాటు 60 ఏళ్లు పైబడి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోస్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే.. ఇందుకు ఏ టీకా డోసు ఇవ్వనున్నారో ఇంకా ఖరారు చేయలేదు. మొదటి రెండు డోసులు ఇచ్చిన టీకానే ఇవ్వాలా? వద్దా? అనే దానిపై విస్తృత చర్చలు జరిగాయని, దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కేంద్రం తాజాగా వెల్లడించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డా.బలరామ్ భార్గవ గురువారం ఈ విషయమై మాట్లాడుతూ.. జనవరి 10లోపు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన సిఫార్సులు జారీ చేస్తుందని తెలిపారు.
‘ప్రికాషన్ డోసుగా ఏ టీకా ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చలు జరుపుతున్నాం. ఈ విషయమై జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా మండలి (ఎన్టీఏజీఐ)లో వరుస సమావేశాలు నిర్వహించాం. దేశవ్యాప్తంగా ఎంత మందికి ఈ డోసు అవసరం? కొత్త వ్యాక్సిన్లు ఏవి అందుబాటులో ఉన్నాయి? సమర్థత, భద్రతాపరంగా ఏ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు? అనేవాటిని నిర్ణయిస్తున్నాం’ అని డా.భార్గవ చెప్పారు. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న మొత్తం డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. జనవరి 10లోపు దీనిపై స్పష్టత వస్తుందని, డీసీజీఐ, ఎన్టీఏజీఐ సమావేశమై నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించారు. జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసుల పంపిణీ మొదలుకానున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.