Pathaan: ఆ సీన్‌లు సరిచేయాల్సిందే.. దీపిక రొమాంటిక్‌ సాంగ్‌పై మంత్రి తీవ్ర అభ్యంతరం!

షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukon) నటించిన పఠాన్‌(Pathaan) చిత్రంలో ‘బేషరమ్‌ రంగ్‌’ రొమాంటిక్‌ సాంగ్‌ వివాదాస్పదమవుతోంది. ఈ పాటలో అభ్యంతరకర సీన్‌లు సరిచేయాలంటూ చిత్రబృందానికి మధ్యప్రదేశ్‌ హోంమంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. 

Updated : 14 Dec 2022 21:01 IST

భోపాల్‌: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukon) కీలక పాత్రల్లో నటించిన పఠాన్‌(Pathaan) చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రొమాంటిక్‌ సాంగ్‌పై మధ్యప్రదేశ్‌ హోంమంత్రి, భాజపా సీనియర్‌ నేత నరోత్తమ్‌ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలో దీపికా పదుకొనే వస్త్రధారణ తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. ఈ సీన్‌లను సరిచేయకపోతే తమ రాష్ట్రంలో ఆ చిత్రం ప్రదర్శనపై ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు.  ఆయన బుధవారం ఇండోర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘బేషరమ్‌ రంగ్‌ పాటలో దీపికా పదుకొణె కాస్ట్యూమ్స్‌ తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. కలుషితమైన మనస్తత్వంతో ఈ పాటను చిత్రీకరించినట్టు అనిపిస్తోంది. ఈ సీన్‌లను, పాటలోని దీపికా కాస్ట్యూమ్‌ సరిచేయాలని కోరుతున్నా. లేదంటే ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్‌లో ప్రదర్శించాలో వద్దా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జేఎన్‌యూ కేసులో తుక్డే తుక్డే గ్యాంగ్‌కు దీపికా మద్దతుదారుగా కనిపించారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 2016లో దిల్లీలో జేఎన్‌యూలో చోటుచేసుకున్న ఘటన తర్వాత తుక్డే తుక్డే గ్యాంగ్‌ అనే పదాన్ని భాజపా తరచూ ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు, సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’ (Pathaan) చిత్రం జనవరి 25న విడుదల కానుండటంతో  ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల ‘బేషరమ్‌ రంగ్‌’ అనే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో దీపిక అందాలు, షారుక్‌ స్టైల్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

ఇదిలా ఉండగా.. రామాయణం ఇతిహాసం ఆధారంగా నిర్మించిన బాలీవుడ్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’లో హిందూ మతానికి చెందిన వ్యక్తుల్ని తప్పుగా చూపించే దృశ్యాల్ని తొలగించకపోతే చట్టపరమైన చర్యలుత ఈసుకుంటామని అక్టోబర్‌లో మంత్రి హెచ్చరించారు. అలాగే, ఈ ఏడాది జులైలో దర్శకురాలు లీనా మణిమేగలై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం కాళీ పోస్టర్‌ వివాదాస్పదం కావడంతో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని