92 సార్లు ఓడినా.. మళ్లీ ఎన్నికల బరిలోకి..
ఎన్నికలు అనగానే ఎవరైనా గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఒక్కసారైనా విజయం సాధించకపోతామా అని కోరుకుంటారు. అయితే.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అంబేడ్కరీ హసనురామ్ మాత్రం అందుకు భిన్నం...
లఖ్నవూ: ఎన్నికలు అనగానే ఎవరైనా గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఒక్కసారైనా విజయం సాధించకపోతామా అని కోరుకుంటారు. అయితే.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అంబేడ్కరీ హసనురామ్ మాత్రం అందుకు భిన్నం. ఇప్పటివరకూ 92 సార్లు బరిలోకి దిగిన ఆయన.. ఒక్కసారీ గెలవలేకపోయారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోసారి నామినేషన్ వేశారు 74ఏళ్ల అంబేడ్కరీ. పైగా ఓటమి కోసమే నామినేషన్ దాఖలు చేస్తున్నానని చెప్పడం గమనార్హం. ఆగ్రా జిల్లా ఖైరాగఢ్కు చెందిన అంబేడ్కరీ 1947 ఆగస్టు 15న జన్మించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1985 నుంచి ఆయన ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ, ఒక్కసారీ గెలుపు ఆయన ఇంటి తలుపు తట్టలేదు. తొలిసారి ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఓ సైనికుడిలా పోరాడానని అంబేడ్కరీ చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారట. కానీ.. ‘‘మీ భార్యే మిమ్మల్ని సరిగ్గా గుర్తించరు, అలాంటిది మీకెవరు ఓటేస్తారు?’’ అని స్థానికులు అవమానించారని పేర్కొన్నారు. ఈ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన హసను.. ఆ తర్వాత బీఎస్పీని వదిలి 1988లో ఖైరాగఢ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాటి నుంచి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వచ్చారు.
ఎలాంటి ఖర్చులేకుండా..
ఇప్పటివరకు 92 సార్లు ఓడిన అంబేడ్కరీ.. ఈ విషయంలో శతకానికి చేరువయ్యారు. మరో 7 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. 100 సార్లు పరాజయం పాలైన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాలని కోరుకుంటున్నానని ఆయనే స్వయంగా చెప్పారు. అందుకోసం ఎలాంటి అవకాశాన్ని వదులుకోనన్న ఆయన.. అదే ఉత్సాహంతో ఎలాంటి ఖర్చు లేకుండా ప్రచారం కూడా సాగిస్తానన్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సారి సొంత భార్యకు వ్యతిరేకంగా పంచాయతీ బరిలో దిగుతున్నారు అంబేడ్కరీ. అదే వార్డు తరఫున ఆయన సతీమణి శివదేవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భార్యాభర్తల ఎన్నికల పోరుపై స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.