రక్షణ శాఖ నుంచి సాయమందించండి: రాజ్‌నాథ్‌

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో రక్షణ శాఖ తరపున పౌరులకు వీలైన సదుపాయాలు అందించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నతాధికారులకు సూచించారు.

Published : 20 Apr 2021 15:54 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో రక్షణ శాఖ తరఫున పౌరులకు వీలైన సదుపాయాలు అందించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే, రక్షణశాఖ కార్యదర్శి, డీఆర్డీవో చీఫ్‌లతో మాట్లాడారు. ‘కరోనా విజృంభణ నేపథ్యంలో రక్షణ శాఖ తరపున పౌరులకు వీలైన సౌకర్యాలు అందించాలి. ఇందుకోసం ఆర్మీ కమాండర్లను ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సీఎం కార్యాలయాలకు పంపించి సహాయాన్ని అందించే ఏర్పాట్లు చేయాలి’ అని ఆర్మీ చీఫ్‌ నరవణేకు రాజ్‌నాథ్‌ సూచించారు.

ఈ క్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘దేశంలోని 67 కంటోన్మెంట్‌ బోర్డు ఆస్పత్రుల్లో కంటోన్మెంట్‌ రెసిడెంట్స్‌కు మాత్రమే కాకుండా.. సాధారణ పౌరులకు కూడా వైద్య సేవలు అందించాలి’ అని ఆదేశించారు. మరోవైపు రాజ్‌నాథ్‌ సూచన మేరకు ఇప్పటికే డీఆర్డీవో తరఫున యూపీ ఆస్పత్రులకు సోమవారం 150 ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేశారు. అదనంగా మరో వెయ్యి సిలిండర్లను త్వరలో డీఆర్డీవో నుంచి సరఫరా చేయనున్నారు.

కాగా దేశంలో తాజాగా 2.59లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 1,761 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,29,329 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని