Delhi airport: రద్దీతో కిక్కిరిసిన దిల్లీ ఎయిర్‌పోర్టు..!

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత కొన్నాళ్లుగా తీవ్రమైన రద్దీ నెలకొంది. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్‌లు పూర్తిచేసుకొని విమానం ఎక్కడానికి కొన్ని గంటల సమయం పడుతోంది.

Published : 11 Dec 2022 18:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత కొన్నాళ్లుగా తీవ్రమైన రద్దీ నెలకొంది. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్‌లు పూర్తిచేసుకొని విమానం ఎక్కడానికి కొన్ని గంటల సమయం పడుతోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమ అవస్థలను సోషల్‌ మీడియాలో పంచుకొంటున్నారు. దిల్లీ ఎయిర్‌పోర్టు బాధితుల్లో ‘హైవే ఆన్‌ మై ప్లేట్‌’ షో వ్యాఖ్యాత రాకీ సింగ్‌ కూడా ఉన్నారు. ఆయన ఆదివారం తెల్లవారుజామున అక్కడి పరిస్థితిని నరకంతో పోలుస్తూ.. ట్వీట్‌ చేశారు. కిక్కిరిసిపోయిన దిల్లీ ఎయిర్‌ పోర్టు లాంజ్‌ ఫొటోను పంచుకొన్నారు. ఈ ట్వీట్‌ను ఆయన పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్‌ చేశారు. ముఖ్యంగా దిల్లీ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రచయిత బ్రహ్మా చలానీ కూడా దిల్లీ ఎయిర్‌పోర్టుపై పౌరవిమానయాన శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ‘‘అంతర్జాతీయ ప్రయాణికుల దృష్టిలో ప్రపంచంలోనే సరిగ్గా నిర్వహించని, విసిగించే విమానాశ్రయంగా దిల్లీ ఎయిర్‌పోర్టు మారుతోంది. ఇమ్మిగ్రేషన్‌, సెక్యూరిటీ వద్ద పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు వీఐపీ సౌకర్యాలను వాడుకొంటూ రాత్రివేళల్లో ఉండే గందరగోళం కనిపించడంలేదు’’ అని పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఈ విమానాశ్రయంలో టెర్మినల్‌ సెక్యూరిటీ , ఇమ్మిగ్రేషన్‌ లైన్లలో జాప్యం తీవ్రంగా ఉంది. వాస్తవానికి ఎయిర్‌పోర్టు నిర్వాహకులకు ఇక్కడ ఎటువంటి నియంత్రణ ఉండదు. ముఖ్యంగా ఐడీ చెక్‌, టికెట్‌ చెకింగ్‌ జరిగే చోట ఈ సమస్య తీవ్రంగా ఉంది. దిల్లీ ఎయిర్‌ పోర్టులో విస్తరణ పనులు జరుగుతుండటంతో ప్రయాణికులను టీ3 వైపు మళ్లించడం కూడా సమస్యకు కారణమవుతోంది. ప్రస్తుతం 6.6 కోట్ల వార్షిక ప్రయాణికుల సామర్థ్యం ఉన్న విమానాశ్రయాన్ని 10 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ పనులు చేస్తున్నారు. 73శాతం ఈ పనులు పూర్తయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని