దిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీనే.. రాజ్యసభ ఆమోదం
దేశ రాజధాని దిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్య అధికార పార్టీ ఈ బిల్లును నెగ్గించుకుంది. దిల్లీ ప్రభుత్వం.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్య అధికార పార్టీ ఈ బిల్లును నెగ్గించుకుంది. దిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని నిర్వచించే ‘ది గవర్న్మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (సవరణ) బిల్లు -2021’ బుధవారం రాత్రి సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇది వరకే లోక్సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. ఈ బిల్లు ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేటికైనా ఎల్జీ ఆమోదం తప్పనిసరి.
బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. మహా భారతంలో ద్రౌపదికి జరిగిందే.. ఇవాళ భారత రాజ్యాంగానికి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. రెండు కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పేంటని ప్రశ్నించారు. స్కూళ్లు తెరవడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, మొహల్లా క్లినిక్లు ఏర్పాటుచేయడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఈ బిల్లు ద్వారా తమ అధికారాలు హరిస్తున్నారంటూ ఈ బిల్లును ఆప్ వ్యతిరేకిస్తుండగా.. పాలన వ్యవహారాల్లో నెలకొన్న అస్పష్టతను తొలగించేందుకు ఈ బిల్లు తెచ్చామని కేంద్ర సర్కారు చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.