Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి ఊరట.. పాస్‌పోర్టు జారీకి కోర్టు ఓకే..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అమెరికా పర్యటనకు మార్గం సుగమమైంది. ఆయనకు కొత్త పాస్‌పోర్టు జారీ చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఇందుకోసం నిరభ్యంతర పత్రాన్ని ఇచ్చింది.

Updated : 26 May 2023 18:15 IST

దిల్లీ: మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi).. కొత్త పాస్‌పోర్టు విషయంలో ఊరట లభించింది. ‘సాధారణ పాస్‌పోర్టు (ordinary passport)’ కోసం నిరభ్యంతర పత్రం కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను దిల్లీ కోర్టు అంగీకరించింది. మూడేళ్ల కాలానికి గానూ ఆయనకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (NOC) జారీ చేసింది. దీంతో రాహుల్‌ త్వరలోనే కొత్త పాస్‌పోర్టు పొందేందుకు వీలు లభించినట్లయింది.

‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌ (Rahul Gandhi)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. ఫలితంగా తన దౌత్య హోదా పాస్‌పోర్టు (Diplomatic Passport)ను ఆయన అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, భాజపా (BJP) నేత సుబ్రమణ్యస్వామి (Subramanian Swamy) ఫిర్యాదుతో నమోదైన నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ నిందితుడు. ఇందులో 2015 నుంచి ఆయన బెయిల్‌పై ఉన్నారు. దీంతో పాస్‌పోర్టు జారీ కోసం నిరభ్యంతర పత్రం కోరుతూ ఆయన ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై రెండు రోజుల క్రితం విచారణ జరిపిన న్యాయస్థానం.. బెయిల్‌ మంజూరు సమయంలో రాహుల్‌పై ఎలాంటి ప్రయాణ ఆంక్షలు విధించలేదని తెలిపింది. అయితే, రాహుల్ ఎన్‌వోసీ పిటిషన్‌ను సుబ్రమణ్యస్వామి వ్యతిరేకించారు. ఆయనకు పాస్‌పోర్టు మంజూరైతే.. అది నేషనల్‌ హెరాల్డ్‌ కేసు (National Herald case)పై ప్రభావం చూపే అవకాశం ఉందని వాదించారు. దీంతో అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని స్వామిని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. సుబ్రమణ్యస్వామి వాదనలను తిరస్కరించింది. రాహుల్‌కు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. అయితే, ఆయన కోరినట్లు 10 ఏళ్లకు కాకుండా.. మూడేళ్ల కాలానికి ఎన్‌వోసీ జారీ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో రాహుల్‌ కొత్త పాస్‌పోర్టు పొందొచ్చు.

కాగా..  రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈ నెల 31 నుంచి పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్‌, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని