Delhi: కొవిడ్‌ కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు: సీఎం కేజ్రీవాల్‌

దిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Published : 31 Mar 2023 15:46 IST

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా(Coronavirus) కేసులు పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా మొత్తం 3,095 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశ రాజధాని దిల్లీ(Delhi)లో రోజువారి కేసుల సంఖ్య ఇటీవల 300 దాటింది. గత ఏడాది ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే, కేసుల పెరుగుదల విషయంలో స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

‘స్థానికంగా కొత్త కేసుల పెరుగుదలకు కొవిడ్‌ ‘ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్’ ప్రధాన కారణం. మొత్తం పాజిటివ్ కేసుల్లో 48 శాతం ఈ వేరియంట్‌కు చెందినవే ఉన్నాయి. ఈ రకం వేగంగా వ్యాపిస్తుంది. కానీ, తీవ్రమైనది కాదు. కొవిడ్ బాధితుల కోసం దిల్లీ ఆసుపత్రుల్లో 7,986 పడకలు సిద్ధం చేశాం. ఐసొలేషన్ వార్డులను నిర్వహించాలని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆదేశించాం. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాం. వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు.. మురుగు పరీక్షలు చేపడుతున్నాం. కొత్త వేరియంట్‌లను సకాలంలో గుర్తించేందుకు వీలుగా.. అన్ని కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నాం’ అని కేజ్రీవాల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మార్చి 30న దిల్లీలో మొత్తం 295 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని