Manish Sisodia: జైలు నంబర్‌ 1లో సిసోదియా.. ధ్యానానికి అనుమతినివ్వండి..

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)కు ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయనకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో తిహాడ్‌ జైలుకు తరలించారు.

Published : 07 Mar 2023 00:15 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi excise scam)లో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)ను తిహాడ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు విచారణ అనంతరం సిసోదియాను నేరుగా తిహాడ్‌ జైలు (Tihar Jain)కు తీసుకొచ్చారు. అక్కడ జైలు నంబర్‌ 1 గదిని ఆయనకు కేటాయించారు. జైల్లో భగవద్గీతతో పాటు కళ్లజోడు, డైరీ, పెన్ను, వైద్యులు సూచించిన మందులను ఉంచుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. విపాసన ధ్యానం చేసేందుకు అనుమతినివ్వాలని సిసోదియా తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. ఆ అభ్యర్థనను పరిశీలించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఇటీవల సిసోదియా (Manish Sisodia)ను సీబీఐ (CBI) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం తొలుత సీబీఐ కస్టడీ విధించింది. ఆ కస్టడీ నేటితో ముగియడంతో సోమవారం ఆయనను కోర్టులో హాజరుపర్చారు. అయితే కస్టడీ పొడిగించమని సీబీఐ కోరకపోవడంతో.. ఆయనకు జ్యుడీషియల్‌ కస్టడీని విధించారు. దీంతో మార్చి 20 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు.

మరోవైపు, ఈ కేసులో బెయిల్‌ కోసం సిసోదియా (Manish Sisodia) దిల్లీ (Delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. దానిపై తమ స్పందన తెలియజేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అనంతరం ఆ విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం మరోసారి విచారణ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని