దిల్లీ అల్లర్లు.. ‘దీప్‌ సిద్ధూ’ పాత్రేంటీ?

సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. కిసాన్‌ పరేడ్‌లో అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చిన కర్షకులు హస్తిన నడిబొడ్డులో ఎర్రకోటను ముట్టడించారు. చారిత్రక కట్టడంపై రైతన్న జెండా

Updated : 27 Jan 2021 14:49 IST

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. కిసాన్‌ పరేడ్‌లో అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చిన కర్షకులు హస్తిన నడిబొడ్డులో ఎర్రకోటను ముట్టడించారు. చారిత్రక కట్టడంపై రైతన్న జెండా ఎగరేశారు. దీంతో అల్లర్లు చెలరేగి దేశ రాజధాని అట్టుడికిపోయింది. అయితే ఇది తమ పనికాదని, విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చేరి అల్లర్లు సృష్టించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌ సిద్ధూ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎర్రకోట ఉద్రిక్తతలకు ఇతడే కారణమని భావిస్తున్న అధికారులు.. దీనిపై నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ దీప్‌ సిద్ధూ ఎవరు..?

పంజాబ్‌కు చెందిన దీప్‌ సిద్ధూ ప్రముఖ గాయకుడు. పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించారు. ముందు నుంచీ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్న సిద్ధూ.. రెండు రోజుల క్రితం మరోసారి దిల్లీకి వచ్చారు. సింఘు సరిహద్దుల్లో రైతుల ఆందోళనల్లో పాల్గొని రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా మంగళవారం జరిగిన కిసాన్‌ పరేడ్‌లోనూ సిద్ధూ పాల్గొన్నారు. ఎర్రకోట వద్ద రైతులు తమ జెండాతో పాటు నిశాన్‌ సాహిబ్‌ జెండాలను ఎగరేసిన సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. 

సిద్ధూపైనే అనుమానాలు..

కాగా.. మంగళవారం ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పరిణామాలకు సిద్ధూనే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్రిక్తతలు జరిగేలా ఆయన రైతులను రెచ్చగొట్టారని దుయ్యబట్టాయి. ‘‘మా ఉద్యమాన్ని కించపరిచేందుకు కొన్ని సంఘ విద్రోహశక్తులు చేరాయి. ఎర్రకోటపై జెండాలు ఎగరవేయాలనేది మా ప్రణాళికలో లేదు. ప్రధానితో దీప్‌ సిద్ధూ ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మాకు ఆయనపై అనుమానాలున్నాయి’’ అని కిసాన్‌ మజ్‌దూర్‌ సంఘర్ష్‌ కమిటీ నేత ఎస్‌ఎస్‌ పందేర్‌ తెలిపారు.  

అటు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘దీప్‌ సిద్ధూ సిక్కు కాదు. ఆయన భాజపా కార్యకర్త. ప్రధానితో ఆయన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది రైతుల ఉద్యమం. బారికేడ్లను ధ్వంసం చేయడం మా ఉద్యమంలో భాగం కాదు. అదంతా విద్రోహుల పని’’ అని ఆయన ఆరోపించారు. అయితే జరిగిన ఘటనలపై ఉద్యమంలో ఒక భాగస్వామిగా సిగ్గుపడుతున్నానని, వాటికి బాధ్యత వహిస్తానని తెలిపారు. 

సిద్ధూను తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని, ఘటన సమయంలో ఆయన ఎర్రకోట వద్దే ఉన్నారని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ ఓ టీవీ కార్యక్రమంలో తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీకి ముందు రోజు కూడా సిద్ధూ రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ విషయంపై తాను పోలీసులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన ఎర్రకోటకు ఎలా చేరుకున్నారో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. 

ఎన్‌ఐఏ నోటీసులు

ఎర్రకోట ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అల్లర్లకు కారణంగా భావిస్తున్న సిధుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఆందోళనకారులను ఎర్రకోటపైకి వెళ్లేందుకు ప్రోత్సహించడం, సామాజిక మాధ్యమాల్లో పంజాబీ యువకులను రెచ్చగొట్టేలా పోస్ట్‌లు చేసిన ఆరోపణలపై నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. రైతుల ఆందోళన వ్యవహారంలో సిధుకు గతంలో పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబరులో, ఈ నెల 16న నోటీసులు పంపినా ఆయన విచారణకు రాలేదు. 

ఆరోపణలు ఖండించిన సిధు..

దిల్లీ అల్లర్ల నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను సిద్ధూ ఖండించారు. ఎర్రకోట ఘటన జరిగిన కాసేపటి తర్వాత సోషల్‌మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘అంతమంది రైతులు ఎర్రకోట వెళ్లేలా నేను ఎలా ప్రోత్సహించగలను. ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తున్నట్లు ఉన్న ఒక్క వీడియో కూడా లేదు’’ అని అన్నారు. 

సినీ నేపథ్యం ఉన్న సిద్ధూ గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో తిరుగుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి, నటుడు సన్నీ దేవోల్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మధ్య సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఎర్రకోట అల్లర్ల తర్వాత సిద్ధూ ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవడం గమనార్హం. 

ఇవీ చదవండి..

కట్టుదిట్టమైన భద్రతా వలయంలో దిల్లీ

ఏమిటా జెండా?

విధ్వంసం.. విద్రోహుల పనే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని