దిల్లీ: ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.5వేలు

దిల్లీలో రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ రెండు నెలలు ఉచిత రేషన్‌ అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

Updated : 14 May 2022 10:47 IST

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటన
లబ్ధిదారులందరికీ 2నెలల ఉచిత రేషన్‌

దిల్లీ: కరోనా విలయంతో అల్లాడుతోన్న దిల్లీలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలుచేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆంక్షలను మే 10వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పేదలు, బలహీనవర్గాలను ఆదుకునేందుకు ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే రెండు నెలలపాటు రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ ఉచిత రేషన్‌ అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 72 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇలా ఇస్తున్నప్పటికీ రెండు నెలలు వరకు లాక్‌డౌన్‌ ఉండదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5వేలు..

లాక్‌డౌన్‌ వల్ల ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వెల్లడించారు. సంక్షోభ సమయంలో ఆర్థికంగా వారికి కొంత ఊరట కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. గతేడాది లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనూ వీరికి దిల్లీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. దీనివల్ల దాదాపు లక్షన్నర మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లబ్ధిపొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇక దిల్లీలో లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 18వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. రోజువారీ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ కొవిడ్‌ మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 448 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాల సంఖ్య 400 నమోదుకావడం వరుసగా ఇది మూడోరోజు కావడం ఆందోళనకర విషయం. ఇప్పటివరకు దిల్లీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 17వేలు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని