ఐదు నెలల తర్వాత దిల్లీ మెట్రో పరుగులు..

దీర్ఘ కాలం తర్వాత దేశ రాజధాని దిల్లీలో మెట్రో రైలు సేవలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల నేపథ్యంలో దశల వారీగా ఈ మెట్రో రైలు సేవలు ప్రారంభించినట్లు దిల్లీ మెట్రో రైలు అధికారులు తెలిపారు.

Published : 07 Sep 2020 16:00 IST

దిల్లీ: సుదీర్ఘ కాలం తర్వాత దేశ రాజధాని దిల్లీలో మెట్రో రైలు సేవలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల నేపథ్యంలో దశల వారీగా ఈ మెట్రో రైలు సేవలు ప్రారంభించినట్లు దిల్లీ మెట్రో రైలు అధికారులు తెలిపారు. ప్రయాణికులెవరూ కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు మెట్రో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దిల్లీ మెట్రో రైలు అధికారులు మాట్లాడుతూ.. ‘హోమంత్రిత్వ శాఖ ఆదేశాలతో దశల వారీగా మెట్రో సేవలు ప్రారంభించాం. సెప్టెంబర్‌ 7-12వ తేదీ వరకు మూడు దశలుగా మెట్రో సేవలు కొనసాగుతాయి. మొదటి రైలు సోమవారం ఉదయం దిల్లీలోని సమయ్‌పూర్‌ నుంచి గురుగ్రామ్‌లోని హుడా కేంద్రానికి బయలుదేరింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో రైళ్లు ఆపేందుకు అవకాశం లేదు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు, శానిటైజర్ల వినియోగం, థర్మల్‌ స్క్రీనింగ్‌ వంటి జాగ్రత్తలు పాటించేలా కఠినమైన ఏర్పాట్లు చేశాం’అని పేర్కొన్నారు.

దిల్లీ మెట్రో సేవలు పునఃప్రారంభం అయిన సందర్భంగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణికులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘మెట్రో సేవలు ప్రారంభమైనందుకు సంతోషంగా ఉంది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులు నిర్లక్ష్యం వహించకుండా ఆయా జాగ్రత్తలు పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు. 

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి 22 నుంచి దిల్లీతో పాటు పలు ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు ఐదు నెలల తర్వాత సేవలు తిరిగి పునఃప్రారంభించడానికి కేంద్రం హోంశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు