దిల్లీ, ముంబయిలో హోలీ వేడుకలు నిషేధం

దేశ రాజధాని దిల్లీ, మహారాష్ట్రలలో కరోనా కేసులు కల్లోలం రేపుతున్నాయి. దీంతో దిల్లీ, ముంబయి నగరాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దిల్లీలో మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1101 కొత్త కేసులు, నాలుగు

Published : 24 Mar 2021 02:11 IST

భారీగా పెరిగిన కొత్త కేసులు

దిల్లీ/ముంబయి: దేశ రాజధాని దిల్లీ, మహారాష్ట్రలలో కరోనా కేసులు కల్లోలం రేపుతున్నాయి. దీంతో దిల్లీ, ముంబయి నగరాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దిల్లీలో మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1101 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో 28వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24గంటల్లోనే ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు రావడం కలవరపెడుతోంది. దీంతో దిల్లీ ప్రభుత్వం హోలీ, నవరాత్రి వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కొవిడ్ పరీక్షలు చేయనున్నారు. 

దిల్లీలో గడిచిన 24గటల్లో 84,237మందికి పరీక్షలు నిర్వహించగా.. 1101మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ రోజు కొత్తగా 620మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు దిల్లీలో 1,39,74,132 శాంపిల్స్‌ నిర్వహించగా.. 6,49,973మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 6,34,595మంది కోలుకోగా.. 10967మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 4,411 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

మహారాష్ట్రలో 132మంది మృతి
మరోవైపు, మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లోనే 28,699 కొత్త కేసులు, 132 మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు 13,165మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,85,84,463మందికి పరీక్షలు నిర్వహించగా.. 25,33,026 మందిలో కరోనా బయటపడింది. వీరిలో 22,47,495మంది కోలుకోగా.. 53,589మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం  2,30,641 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ముంబయిలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో  హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని