Covid Variant: దేశంలో 22 డెల్టా ప్లస్‌ కేసులు

దేశంలో కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో వేరియంట్‌ కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్‌లో సంభవించిన మ్యుటేషన్‌ కారణంగా పుట్టుకొచ్చిన ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ కేసులు దేశంలో 22 నమోదయినట్లు....

Published : 22 Jun 2021 20:07 IST

మరో ఎనిమిది దేశాల్లోనూ బయటపడ్డ కేసులు

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో వేరియంట్‌ కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్‌లో సంభవించిన మ్యుటేషన్‌ కారణంగా పుట్టుకొచ్చిన ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ కేసులు దేశంలో 22 నమోదయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్రలోని రత్నగిరి, జల్‌గావ్‌ ప్రాంతాలతో పాటు కేరళ, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా ఆయా ప్రాంతాల్లోని ప్రజారోగ్యంపై నివేదిక రూపొందించేందుకు ఓ బృందాన్ని పంపించినట్లు కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు. ఈ చిన్న సంఖ్య భారీ సంఖ్యగా మారకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరో 8 దేశాల్లోనూ డెల్టా ప్లస్‌ కేసులు బయటపడినట్లు వీకే పాల్‌ వెల్లడించారు. అమెరికా, బ్రిటన్‌, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌, జపాన్‌, పోలాండ్‌, రష్యా, చైనాల్లోనూ ఈ కేసులు వెలుగుచూస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్, కొవాక్సిన్ టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని.. త్వరలోనే డెల్టా ప్లస్‌పై వాటి పనితీరును వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో తొలిసారి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నెల 16న ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి అంత ఆందోళనకరం కాదని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వేరియంట్‌ ఉనికిని, పెరుగుదలను ఎప్పటికప్పుడు కొవిడ్ వేరియంట్లను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన INSACOG ద్వారా పరిశీలిస్తున్నట్లు వీకే పాల్‌ తెలిపారు. వైరస్‌లు అనేవి ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతుంటాయని, అయితే, మరో ఉప్పెన రాకుండా తాము అప్రమత్తంగా ఉంటున్నామని సీసీఎంబీ సలహాదారు రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని