india vs china: శ్రీలంకలోభారత్‌ పాగా..!

శ్రీలంక నుంచి భారత్‌కు దూరం కేవలం వందల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.. అలాంటి దేశంలోని ఓడరేవుల్లో పాగా వేసింది..

Published : 04 Jan 2022 01:55 IST

 ట్రింకోమలీ చమురు ట్యాంక్‌ల అభివృద్ధిలో భారత్‌కు వాటా..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

శ్రీలంక నుంచి భారత్‌కు దూరం కేవలం వందల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.. అలాంటి దేశంలోని ఓడరేవులో భారత్‌ పాగా వేసింది. ఓ దశలో చైనా (china) ఏకంగా సబ్‌మెరైన్లను కూడా శ్రీలంకలో నిలిపిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాస్తవాధీన రేఖ వెంట.. పాకిస్థాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌, గ్వాదర్‌ పోర్టు.. శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టులో  డ్రాగన్‌ దళాలు మోహరిస్తే సంక్షోభ సమయంలో భారత్‌ అన్ని వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటుంది. అందుకే భారత్‌ శ్రీలంకలో పరపతి పెంచుకోవడానికి చకచకా యత్నాలు చేస్తోంది. తాజాగా ‘చైనా బే’కు అత్యంత సమీపంలోని ట్రింకోమలీ చమురు ట్యాంకుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. చైనా బే అనేది ట్రింకోమలీ రేవులోని ఓ భాగం పేరు. ఎక్కువగా చైనా నౌకలు వ్యాపారం చేసే ప్రదేశం కావడంతో ఆ పేరు వచ్చింది. 

ట్రింకోమలీ చమురు ట్యాంకుల క్షేత్రంలో అభివృద్ధిలో భారత్‌కు వాటా..

శ్రీలంకలోని ట్రింకోమలీ ప్రపంచంలోనే మూడో అత్యంత లోతైన, పెద్ద పోర్టు. ఇక్కడికి సమీపంలోని ‘చైనాబే’ అనే ప్రాంతంలో.. ఒక్కోదానికి దాదాపు 12వేల కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న 99 చమురు ట్యాంకులు ఉన్నాయి. వీటిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిందూ మహాసముద్రంలో నౌకల్లో చమురు నింపేందుకు బ్రిటిష్‌ పాలకులు నిర్మించారు. ఈ పోర్టు అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. ఈ పోర్టులోని చమురు ట్యాంకుల అభివృద్ధి ప్రాజెక్టులో భారత్‌కు వాటా దక్కినట్లు శ్రీలంక ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిల ప్రకటించారు. భారత్‌కు చెందిన ‘లంక ఐవోసీ’కు 49శాతం వాటా.. శ్రీలంకకు చెందిన ‘సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌’(సీపీసీ)కు 51శాతం వాటా లభించనుంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 99 ట్యాంకుల్లో 61 సంయుక్తంగా పునరుద్ధరిస్తారు. సీపీసీ 24.. లంక ఐవోసీ 14 అభివృద్ధి చేస్తాయి. వచ్చే 50 ఏళ్లపాటు సీపీసీ-లంక ఐవోసీ మధ్య ఒప్పందం అమల్లో ఉంటుంది. లంక ఐవోసీ అభివృద్ధి చేసే 14 ట్యాంకులలో శ్రీలంక ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది.

ఈ పోర్టు భారత్‌లోని చెన్నైకు అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ నౌకల రిఫ్యూయలింగ్‌ స్టేషన్‌ నెలకొల్పాలని లంకా ఐవోసీ భావిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ 10లక్షల టన్నుల చమురు నిల్వచేసేలా ఏర్పాట్లు చేశారు.

35 ఏళ్ల తర్వాత పట్టాలెక్కి.. 

వాస్తవానికి ఈ ఒప్పందానికి 35 ఏళ్ల క్రితమే బీజాలు పడ్డాయి. అప్పట్లో ఎల్‌టీటీఈపై పోరుకు భారత్‌ సాయం చేసింది. ఆ సమయంలో భారత్‌ ఈ చమురు ట్యాంకుల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంపై శ్రీలంకతో చర్చించింది. నాటి లంక అధ్యక్షుడు జె.ఆర్‌.జయవర్థనే- భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ మధ్య 1987 జులై 29 ఈ చమురు ట్యాంకుల క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్న నిర్ణయం జరిగింది. కానీ, ఆ తర్వాత దాదాపు 15 ఏళ్లపాటు శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా ఇది వాస్తవరూపం ధరించలేదు. 2002లో నార్వే మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ శ్రీలంక విభాగాన్ని ‘లంక ఐవోసీ’పేరిట ప్రారంభించింది. ఈ చమురు ట్యాంకులను 35ఏళ్ల లీజుకు తీసుకొంది. ఏటా ఇందు కోసం లక్ష డాలర్లను చెల్లించేందుకు అంగీకరించింది.

2004లో పరిస్థితులు వేగంగా మారిపోయి.. భారత్‌-శ్రీలంక మధ్య దూరం పెరిగింది. మరోవైపు లంక ఐవోసీ వేగంగా విస్తరించి.. 200 రిటైల్‌ పెట్రోల్‌ పంపులను ప్రారంభించింది. మొత్తం 14 ట్యాంకులను, రెండు లూబ్‌ మిక్సింగ్‌ ట్యాంకులను, ట్రింకోమలీ ఓడరేవు జెట్టీ నుంచి ట్యాంకుల వరకు పైపులైన్‌ను పునరుద్ధరించింది. తొలుత ఇక్కడ పెట్టుబడులపై భారత్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, 2010లో చైనా హంబన్‌టోటలో అడుగుపెట్టడంతో ప్రమాద ఘంటికలు మోగాయి. ఫలితంగా భారత్‌ ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2015లో ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రింకోమలీలో సంయుక్తంగా పెట్రోలియం హబ్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కానీ, భారత్‌-శ్రీలంక మధ్య తరచూ చైనా ప్రోత్సాహంతో ఏదో ఒక వివాదం తలెత్తడంతో ఈ సంబంధాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి.

డ్రాగన్‌ బెదిరింపులకు భయపడి.. 

గతేడాది ప్రభుత్వ నిర్ణయాల కారణంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి భారీగా దెబ్బతింది. ఆహారం ధర గణనీయంగా పెరిగిపోయింది. 2022లో బాండ్ల చెల్లింపుల కోసం ఆ దేశానికి కనీసం 4.5 బిలియన్‌ డాలర్లు అవసరం. కానీ, విదేశీ రిజర్వులు 1.6 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో చైనా నుంచి నాసిరకం సేంద్రియ ఎరువులను సరఫరా చేశారు. దీంతో వాటిని స్వీకరించేందుకు, చెల్లించేందుకు లంక నిరాకరించింది. కానీ, చైనా ఆర్బిట్రేషన్‌కు వెళతానని బెదిరించింది. దీంతో శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్సా హుటాహుటిన భారత్‌కు వచ్చి ఆర్థిక సాయం కోరారు. నాలుగు మార్గాల్లో సంబంధాలు పెంపొందించుకోవచ్చని ప్రతిపాదించారు. భారత్‌ నుంచి లైనాఫ్‌ క్రెడిట్‌పై చమురు కొనుగోలు, ఆహార కొనుగోలుకు లైనాఫ్ క్రెడిట్‌, ట్రింకోమలీ చమురు నిల్వ క్షేత్రాల అభివృద్ధి, భారత పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా డీల్‌ కొలిక్కి వచ్చినట్లు సమచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని