Resort murder: ఆమెపై అత్యాచారం జరిగిన ఆధారాల్లేవ్‌..!

19ఏళ్ల యువతి హత్య కేసు ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా దుమారం రేపుతోంది.

Updated : 28 Sep 2022 16:47 IST

దేహ్రాదూన్‌: 19ఏళ్ల యువతి హత్య కేసు ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే ఆ కేసులో బహిష్కృత భాజపా నేత కుమారుడు పుల్కిత్‌ ఆర్య, ఇద్దరు సిబ్బంది అరెస్టయ్యారు. ఈ హత్యకేసులో తాజాగా కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం నివేదికలో హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే ఆమె వేళ్లు, చేతులు, వీపు భాగంలో గాయం గుర్తులు ఉన్నట్లు తెలిపాయి. 

మరోపక్క ఈ కేసు తీవ్ర వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారించనున్నట్లు చెప్పారు. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. 

భాజపా బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్‌ ఆర్యకు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు దగ్గర్లో రిసార్టు ఉంది. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి గతవారం హత్యకు గురైంది. కొద్దిరోజుల తర్వాత అక్కడికి దగ్గర్లోని కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. రిసార్టుకు వచ్చే అతిథులకు ఆమె ‘ప్రత్యేక’సేవలు చేసేందుకు నిరాకరించినందుకే పుల్కిత్‌, మరో ఇద్దరు సిబ్బంది ఆమెను హత్యచేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు, ఓ ఫోన్‌ కాల్ వివరాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాక్ష్యాలను సమాధి చేసేందుకే రిసార్టుపై బుల్డోజర్ చర్య చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని