DigiYatra: అందుబాటులోకి ‘డిజియాత్ర’.. విమానాశ్రయాల్లో ప్రవేశం మరింత సులభతరం!

విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశాలను మరింత సులభతరం చేసేందుకు రూపొందించిన ‘డిజియాత్ర(DigiYatra)’ సేవలు దేశంలో తొలిసారి అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సేవలను ప్రారంభించారు.

Published : 01 Dec 2022 19:00 IST

దిల్లీ: విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశాలను మరింత సులభతరం చేసేందుకు ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికత(ఎఫ్‌ఆర్‌టీ) ఆధారంగా రూపొందించిన ‘డిజియాత్ర(DigiYatra)’ సేవలు దేశంలో తొలిసారి అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGIA)లో ఈ సేవలను ప్రారంభించారు. డిజిటైజేషన్‌లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ ‘డిజియాత్ర’ సేవలు.. వారణాసి, బెంగళూరులోనూ నేడు అందుబాటులోకి వచ్చాయి. 2023 మార్చినాటికి హైదరాబాద్, కోల్‌కతా, పుణె, విజయవాడలోనూ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ప్రస్తుతానికి దేశీయ ప్రయాణికులకు ఈ సేవలను పరిమితం చేశారు.

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల చెక్‌ ఇన్‌ ప్రక్రియను కాగితరహితంగా, మరింత సులభతరంగా మార్చి.. డిజిటైషన్‌ చేయాలనే ప్రధాన లక్ష్యంతో ‘డిజి యాత్ర’ సేవలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికత(ఎఫ్‌ఆర్‌టీ) ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌లోని చెక్‌ పాయింట్‌ల వద్ద ప్రయాణికుల వివరాలను సేకరించి, ఆటోమెటిక్‌గా ధ్రువీకరిస్తారు. సెక్యూరిటీ చెక్ వద్ద కూడా ప్రయాణికుల డేటా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది. ఈ సేవలను విమాన ప్రయాణాల్లో కొత్త అధ్యాయంగా మంత్రి అభివర్ణించారు.

ఈ సేవలు పొందాలనుకునేవారు ముందుగా.. ‘డిజియాత్ర’ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఇందుకు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, స్వీయచిత్రం అవసరం. ఆపై బోర్డింగ్‌ పాస్‌ను స్కాన్‌ చేయాలి. దీంతో ప్రయాణికుల వివరాలు సంబంధిత విమానాశ్రయానికి చేరతాయి. అనంతరం.. ఎయిర్‌పోర్ట్‌ ఈ- గేట్ వద్ద ‘డిజియాత్ర’ను ఉపయోగించి, బోర్డింగ్ పాస్ బార్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అక్కడ ఇన్‌స్టాల్ చేసి ఉన్న ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ వ్యవస్థ ప్రయాణికుడికి సంబంధించిన వివరాలను ధ్రువీకరిస్తుంది. దీంతో ప్రయాణికులు సులభంగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని