‘టూల్‌కిట్‌’ సూత్రధారులు వారే..!

సామాజిక మాధ్యమంలో గ్రెటా థన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌కిట్‌’ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశతో పాటు నికితా జాకబ్‌, శంతనులే కీలక సూత్రధారులని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

Published : 16 Feb 2021 01:19 IST

వెల్లడించిన దిల్లీ పోలీసులు

దిల్లీ: సామాజిక మాధ్యమంలో గ్రెటా థన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌కిట్‌’ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశతో పాటు నికితా జాకబ్‌, శంతనులే కీలక సూత్రధారులని దిల్లీ పోలీసులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రూపొందించిన టూల్‌కిట్‌ను వీరే గ్రెటా థన్‌బర్గ్‌తో పంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నమోదైన దేశద్రోహం కేసులో దిశరవి అరెస్టయ్యారు. అయితే, వీరిని విడుదల చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు, వ్యవసాయ సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటివరకు విచారణలో తేలిన విషయాలను దిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఈ ‘టూల్‌కిట్‌’ను చేరవేసేందుకు దిశ ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు దిల్లీ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌(సైబర్‌) సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, ఈ వాట్సాప్‌ గ్రూపును దిశ తొలగించినట్లు  గుర్తించామన్నారు. అంతేకాకుండా, గణతంత్ర దినోత్సవం ముందు రోజు ఖలిస్థాన్‌ గ్రూపునకు చెందిన పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌(పీజేఎఫ్‌) ఏర్పాటు చేసిన జూమ్‌ మీటింగ్‌లో నికితా జాకబ్‌, శంతను పాల్గొన్నారని దిల్లీ పోలీసులు ఆరోపించారు. అంతేకాకుండా టూల్‌కిట్‌ను ఎడిట్‌ చేసిన వారిలో నికితా జాకబ్‌ ఉన్నారని తెలిపారు.

ఇదిలాఉంటే, ఈ టూల్‌కిట్‌ వ్యవహారంలో ఇప్పటికే దిశ రవిని అరెస్టు చేయడంతో పాటు ఇద్దరిపై అరెస్టు వారెంటు జారీ చేశారు. ‘టూల్‌కిట్’ వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో నికితా జాకబ్‌, శంతనులపై పోలీసుల వినతి మేరకు దిల్లీ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది.

ఏమిటీ టూల్‌కిట్‌?

ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌.. దిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా ‘టూల్‌ కిట్‌’ అనే డాక్యుమెంట్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. ట్విటర్‌ ఆందోళనలు, భారత రాయబార కార్యాలయాల వెలుపల నిరసన కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యల జాబితాను దీనిలో సూచించారు. ఈ టూల్‌కిట్‌కు దిశ రవి ఎడిటర్‌గా వ్యవహరించారని.. దీని తయారీలో, ప్రచారం కల్పించటంలో కూడా ఆమె కీలక కుట్రదారుగా ఉన్నారని పోలీసులు అంటున్నారు.

ప్రముఖుల స్పందనలివీ..

• ‘‘తుపాకులను కలిగినవారు, నిరాయుధురాలైన ఓ యువతికి భయపడుతున్నారు. ఆ అమ్మాయికి నా తరఫు నుంచి ధైర్యాన్ని అందచేస్తున్నాను. దిశా రవిని విడుదల చేయాలి’’ అని ప్రియాంకా గాంధీ ట్వీట్‌ చేశారు.

• రైతులకు మద్దతు పలికేందుకు ఉద్దేశించిన టూల్‌కిట్‌, భారత భూభాగంలో చైనా దురాక్రమణ కంటే ప్రమాదకరమేమీ కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. మౌంట్‌ కార్మెల్‌ కాలేజ్‌లో చదువుతున్న విద్యార్థిని, పర్యావరణ కార్యకర్త అయిన దిశా రవి.. దేశానికి ప్రమాదకారి అయిందంటే భారత్‌ అంత బలహీనమైన పునాదులపై ఉందా? అంటూ వరుస ట్వీట్లలో ప్రశ్నించారు.

• దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆల్‌ ఇండియా ప్రొగ్రెసివ్‌ వుమన్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కవితా కృష్ణన్‌, హక్కుల కార్యకర్త షబ్నమ్‌ హష్మీ, తొమ్మిదేళ్ల పర్యావరణ వేత్త లిసిప్రియా కాంగుజామ్‌ తదితరులు దిశ అరెస్టుపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. 50 మందికి పైగా విద్యావేత్తలు, కళాకారులు, కార్యకర్తలు కలిసి దిశ అరెస్టు అన్యాయమని, ప్రభుత్వం మరీ అతిగా స్పందిస్తోందని సంయుక్త  ప్రకటనను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని