Train Accident: రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Updated : 03 Jun 2023 00:40 IST

బాలేశ్వర్: ఒడిశాలో (Odisha)ని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 70 మందికి పైగా మృతిచెందారు. 350 మందికి పైగానే క్షతగాత్రులు అయ్యారు. ఈ రైలు దుర్ఘటనపై (Train Accident) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో (Droupadi Murmu) పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రైలు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదనకు గురి చేస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రమాద ఘటన తనను కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రధానికి రైల్వే మంత్రి వివరించారు. రైలు ప్రమాదం దురదృష్టకరమైన ఘటన అని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయ్‌ అన్నారు. రైలు ప్రమాద ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్న ఆయన.. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. శనివారం ఉదయం ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్టు చెప్పారు. 

మమతా బెనర్జీ దిగ్భ్రాంతి

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురికావడంపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు ఈ సాయంత్రం గూడ్సు రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెబుతూ.. 033-22143526/22535185 నంబర్లను ఆమె షేర్‌ చేశారు. ఘటనా స్థలానికి 5-6 సభ్యుల బృందంతో పాటు రైల్వే అధికారులను పంపిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో కలిసి తాను వ్యక్తిగతంగా అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు దీదీ ఓ ప్రకటనలో తెలిపారు.

షాక్‌కు గురయ్యా.. వెంటనే ఒడిశా సీఎంతో మాట్లాడా: స్టాలిన్‌

ఒడిశాలో రైలు ప్రమాద దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన గురించి తెలియగానే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రవాణాశాఖ మంత్రితో పాటు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించినట్టు చెప్పారు. తక్షణమే హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటుకు ఆదేశించారు.

* ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకుంది. ఇతర బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా - కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

* క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. కాంగ్రెస్‌ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనండి.-  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

* క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలి. - రాహుల్‌ గాంధీ.

* ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధ కలిగించింది. నా ఆలోచనలు బాధిత ప్రయాణికులు, వారికుటుంబాల చుట్టూనే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. - కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

* ఘోర రైలు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. సహాయక చర్యలు విజయవంతం కావాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని కోరుకుంటున్నాను.- కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌

* ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని, వారికి భరోసా కల్పించాలి. - తెలంగాణ సీఎం కేసీఆర్‌

*  ఘోర రైలు ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఓం శాంతి. - నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి

* రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రమాద స్థలానికి వెళ్తున్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. - నిర్మలా సీతారామన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని