Military: చైనా ఫోన్లు వాడొద్దు.. భారత సైన్యానికి నిఘా వర్గాల హెచ్చరిక

సైనిక సిబ్బంది (Military) చైనా ఫోన్లు (China Phone) వాడకుండా చర్యలు తీసుకోవాలంటూ రక్షణశాఖ నిఘా వర్గాలు హెచ్చరించాయి. చైనా ఫోన్లలో మాల్‌వేర్‌, స్పైవేర్‌లను ఇటీవల గుర్తించిన నేపథ్యంలో వాటికి బదులు వేరే ఫోన్లు వాడాలని సూచించాయి. 

Published : 07 Mar 2023 22:12 IST

దిల్లీ: భారత్‌, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి కొంతకాలంగా ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై రెండు దేశాల సైనికాధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ క్రమంలో భారత సైన్యానికి (Military) ఇక్కడి నిఘా సంస్థలు కీలక సూచనలు చేశాయి. సైనిక సిబ్బంది చైనా మొబైల్‌ ఫోన్లను (China Phone) వాడకుండా చర్యలు తీసుకోవాలంటూ రక్షణశాఖ అధికారులకు సూచించాయి. మాల్‌వేర్‌, స్పైవేర్‌ల ముప్పు పొంచివున్న నేపథ్యంలోనే నిఘా వర్గాలు ఈ హెచ్చరిక చేసినట్లు సమాచారం.

చైనా మొబైల్‌ ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలని సైనిక సిబ్బందికి తెలియజేయాలంటూ రక్షణశాఖ నిఘా వర్గాలు ఓ సర్క్యూలర్‌ జారీ చేశాయి. భారత విరోధి దేశాల్లో తయారు చేసిన మొబైల్‌ ఫోన్లను సైనిక సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు వాడకుండా జాగ్రత్త పడాలని అందులో పేర్కొన్నాయి. ఇటీవల కొన్ని చైనా ఫోన్లలో మాల్‌వేర్‌, స్పైవేర్‌లు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలోనే నిఘా వర్గాలు ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు రక్షణశాఖ శాఖ నిఘా వర్గాలు వెల్లడించాయి.

చైనాకు చెందిన ఎన్నో రకాల మొబైల్‌ ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇలా చైనాకు చెందిన యాప్స్‌పైనా నిఘా వర్గాలు గతంలో చర్యలు తీసుకున్నాయి. సైనికుల్లో ఎవరైనా చైనా యాప్స్‌ వాడుతున్నట్లు గుర్తించిన వెంటనే వాటిని తొలగించాయి. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న కారణంగా భారత ప్రభుత్వం కూడా చైనాకు చెందిన అనేక యాప్స్‌ను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే చైనా ఫోన్లు వాడుతున్నవారు ఇతర ఫోన్లకు మారాలని రక్షణశాఖ నిఘా వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని