Pratibha Singh: ‘నా భర్త, అత్త వేధించారు’.. హిమాచల్ కాంగ్రెస్‌ చీఫ్‌పై గృహహింస కేసు..

ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల సమయంలో సీఎం పదవి రేసులో పేరు వినిపించిన కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ సమస్యలో చిక్కుకున్నారు. ప్రతిభా సింగ్, ఆమె కుమారుడిపై గృహహింస కేసు నమోదైంది.

Published : 16 Dec 2022 12:22 IST

ఉదయ్‌పుర్‌/శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) కాంగ్రెస్‌ చీఫ్‌, ఎంపీ ప్రతిభా సింగ్‌ (Pratibha Singh), ఆమె కుమారుడు, నూతన ఎమ్మెల్యే విక్రమాదిత్య (Vikramaditya Singh)పై రాజస్థాన్‌లో గృహహింస కేసు నమోదైంది. అత్తింటివారు తనను వేధించారంటూ విక్రమాదిత్య భార్య సుదర్శనా సింగ్ చుండావత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో విచారించేందుకు ప్రతిభా సింగ్‌, ఆమె కుమారుడికి ఉదయ్‌పుర్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు.

విక్రమాదిత్య, సుదర్శనకు 2019 మార్చిలో వివాహమైంది. అయితే పెళ్లి అయిన కొన్ని నెలలకే అత్తింటివారు తనపై గృహహింసకు పాల్పడ్డారని.. మానసికంగా, శారీరకంగా వేధించారని సురద్శన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై నిఘా పెట్టేందుకు విక్రమాదిత్య గదిలో సీసీటీవీ కెమెరాలు పెట్టారని తెలిపారు. గతేడాది తన మామ వీరభద్రసింగ్‌ మరణించాక, తనను ఉదయ్‌పుర్‌లోని పుట్టింటికి పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక, తన భర్తకు చండీగఢ్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉందని ఆరోపించారు. ఇక, విక్రమాదిత్య నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ ఆమె మరో కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఉదయ్‌పుర్‌ పోలీసులు.. ప్రతిభాసింగ్, ఆమె కుమారుడికి సమన్లు జారీ చేశారు.

ఈ సమన్లపై విక్రమాదిత్య స్పందించారు. గృహహింస కేసులో తమకు ఎటువంటి వారెంట్లు రాలేదని తెలిపారు. ఇందులో తమ తప్పేమీ లేదని, అయితే ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారమని పేర్కొన్నారు. దీన్ని కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు.

ప్రతిభాసింగ్‌ భర్త వీరభద్రసింగ్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అగ్రనేత. గతేడాది ఆయన మరణించారు. ఆ తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ లోక్‌సభ స్థానం నుంచి ప్రతిభాసింగ్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత.. ప్రతిభా సింగ్‌ సీఎం అవుతారని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజా శాసనసభ ఎన్నికల్లో విక్రమాదిత్య శిమ్లా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని